భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో యాసంగి సాగుపై రైతుల్లో అయోమయం నెలకొన్నది. వానకాలంలో సాగు చేసిన వరి పంట అకాల వర్షాలు, తుఫాను కారణంగా దెబ్బతినడం.. ఉన్న కొద్దిపాటి పంట పూర్తిస్థాయిలో చేతికి రాకపోవడం.. చేతికొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం.. బయటి వ్యాపారులకు విక్రయించిన పంట డబ్బులు ఇంకా రైతుల చేతికి అందకపోవడం వంటి తదితర కారణాలతో యాసంగి సాగుపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో గత ఏడాది కంటే ఈ సంవత్సరం యాసంగి వరి సాగు తగ్గేటట్లు కనిపిస్తున్నది. 2022-23లో వరి పంట 62,417 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 4,866 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. జొన్న పంట కూడా 944 ఎకరాలకు.. 166 ఎకరాల్లో మాత్రమే సాగు చేసినట్లు వ్యవసాయాధికారుల లెక్కలు చెబుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఈసారి యాసంగి సాగు బాగా తగ్గింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే మార్కెట్లో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. యాసంగి పంట సీజన్ పూర్తయిన తర్వాత వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తున్నది.
తగ్గిన సాగు విస్తీర్ణం..
యాసంగి సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోల్చితే జిల్లాలో ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది. కారణాలు ఏమైనా.. రైతుబంధు సాయం ఆలస్యంగా అందడమా.. లేదా అకాల వర్షాలు గతంలో సాగు చేసిన పంటలను దెబ్బతీయడమా.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడమా.. వెరసి యాసంగి పంట సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. గత ఏడాది 2,12,462 ఎకరాల్లో రైతులు పంటలు వేయగా.. ఈ ఏడాది సాధారణ సాగు 1,72,960గా వ్యవసాయాధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు 1,40,098 ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో వానకాలం వేసే పంటల విస్తీర్ణాన్ని కూడా కలిపి యాసంగి సాగు లెక్కలు తీశారు. మొక్కజొన్న 28,450 ఎకరాలు వేయగా.. ఈ ఏడాది 12,545 ఎకరాల్లో సాగు చేశారు. చివరికి కూరగాయల పంట కూడా గత ఏడాది 2,288 ఎకరాల్లో వేయగా.. ఈ ఏడాది 526 ఎకరాల్లో సాగు చేశారు. జిల్లాలో పొగాకు పంటను రైతులు చాలా వరకు తగ్గించారు. పొద్దుతిరుగుడు 501 ఎకరాలకు.. 110 ఎకరాల్లో వేశారు. వేరుశనగ గత ఏడాది 2,747 ఎకరాల్లో వేయగా.. ఈ ఏడాది 1,288 ఎకరాల్ల్లో సాగు చేశారు. మొత్తంగా యాసంగి సాగుపై రైతులు ఎటూ తేల్చుకోలేకపోతున్నట్ల్లు తెలుస్తోంది.
ఆలస్యంగా వరి కోతలు
వానకాలం సీజన్లో అకాల వర్షాలు, తుఫాను ప్రభావం పంటలపై చూపింది. దీంతో జిల్లాలో కోతలు ఆలస్యమయ్యాయి. ఇంకా పొలాల్లోనే పంట ఉంది. మార్చి వరకు యాసంగి వరి నాట్లు పూర్తయ్యే అవకాశం ఉంది. రైతుబంధు డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో పడుతున్నాయి. ఈ నెల చివరికల్లా రైతుబంధు జమ అవుతుంది. వరి ధాన్యానికి బయట రేటు ఎక్కువ ఉండడం వల్ల రైతులు బయట విక్రయిస్తున్నారు. రైతులు యాసంగిలో ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి.
– కొర్సా అభిమన్యుడు, జిల్లా వ్యవసాయాధికారి