కారేపల్లి మార్చి 27: ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోగల గ్రామాల్లో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగాయి. గ్రామ గ్రామాన గల రామాలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవంను నిర్వాహకులు అత్యంత భక్తిశ్రద్ధలత,వైభవంగా జరిపించారు. రాముడు సీతమ్మను మనువాడిన ఘట్టాన్ని గ్రామస్తులంతా కనులార తిలకించారు.
శ్రీరామనవమిగా పిలువబడే ఈ పండుగ ప్రజల మధ్య ఐక్యతను చాటడమే కాకుండా, రాముని ఆదర్శాలను గుర్తుచేస్తూ ఆధ్యాత్మికతతో గ్రామాలన్నీ పులకించిపోయాయి. పలువురు దంపతులు పీటలపై కూర్చొని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. రామాలయ ప్రాంగణాలలో గల చలువ పందిరిలలో భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు.