కొత్తగూడెం సింగరేణి, జూలై 7: సింగరేణి బొగ్తు ఉత్పాదన సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా రూ.33,065 కోట్ల టర్నోవర్లో రూ.2,222 కోట్ల నికర లాభాలను ఆర్జించి సరికొత్త రికార్డు సృష్టించింది. సంస్థ సీఎండీ శ్రీధర్ ఈ వివరాలను శుక్రవారం ప్రకటించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అధికోత్పత్తికి కృషి చేసి అత్యధిక టర్నోవర్, లాభాలు సాధించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, యూనియన్ నాయకులకు అభినందనలు తెలిపారు. సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు అమ్మకాలు, విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.3071 కోట్ల స్థూల లాభాలను నమోదు చేసింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇతర ట్యాక్సులకు చెల్లింపుల చేసిన అనంతరం రూ.2,222 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సింగరేణి చరిత్రలో ఇది ఒక ఆల్టైం రికార్డు. 2021-22 ఎఫ్వైలో సాధించిన నికర లాభాలు రూ.1227 కోట్లతో పోలిస్తే తాజా లాభాలు 81 శాతం అధికం. అలాగే టర్నోవర్ కూడా 2021-22లో రూ.26,585 కోట్లు ఉండగా.. ఇప్పుడు 24 శాతం అధికంగా రూ.33,065 కోట్లుగా నమోదైంది.
లాభాల్లో 430 శాతం వృద్ధి..
తెలంగాణ ఏర్పడక ముందు 2013 -14 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే సింగరేణి సంస్థ అబ్బుర పరిచే లాభాలను నమోదు చేసింది. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలో 430 శాతం వృద్ధిని సాధించడం విశేషం. 2013-14లో రూ.419 కోట్ల నికర లాభాలు సాధించగా.. 2022-23లో రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించి అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ఇదే కాలంలో దేశంలోని వివిధ మహారత్న కంపెనీలు సాధించిన లాభాల వృద్ధి కన్నా సింగరేణి సాధించిన వృద్ధి ఎంతో ఎక్కువ. 430 శాతం వృద్ధితో సింగరేణి మొదటి స్థానంలో ఉండగా.. 241 శాతం వృద్ధితో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రెండో స్థానంలో, 114 వృద్ధితో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మూడో స్థానంలో, 86 శాతం వృద్ధితో కోలిండియా నాలుగో స్థానంలో ఉన్నాయి.