కొత్తగూడెం సింగరేణి, జనవరి 17: ఖండాంతరాల్లో ఖ్యాతినార్జించిన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ విజయ బావుటా వెనుక మన సింగరేణి బిడ్డ జీవన్బాబు కూడా కీలక భాగస్వామిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంఎం కీరవాణి స్వరపర్చిన ఈ సినిమాలోని ‘నాటు నాటు వీర నాటు’ పాటను అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ గోల్డెన్ అవార్డు వరించిన విషయం పాఠకులకు తెలిసిందే. అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో సోమవారం రాత్రి ఈ అవార్డును ఎంఎం కీరవాణి అందుకున్నారు.
ఈ పాటకు సంగీతం సమకూర్చిన బృందంలో మ్యూజీషియన్, కీ బోర్డ్ ప్లేయర్ గుమ్మినేని జీవన్బాబు ఉన్నారు. లాస్ ఏంజిల్స్ వేదికపై జీవన్బాబు పేరును అవార్డు స్వీకర్త కీరవాణి ప్రస్తావించారు. జీవన్బాబు తండ్రి గుమ్మినేని రాయమల్లు.. సింగరేణి జూనియర్ టెక్నికల్ అధికారిగా పనిచేస్తున్నారు. పుత్రోత్సాహంతో పొంగిపోతున్న రాయమల్లును, ఆయన కుమారుడు జీవన్బాబును కొత్తగూడెం అభ్యుదయ కళా సేవాసమితి అధ్యక్షుడు మద్దెల శివకుమార్, సింగర్ ఆఫ్ సింగరేణి అల్లి శంకర్, సినీ నటుడు ధన్రాజ్, సంగీత దర్శకులు మారపాక కృష్ణస్వా మి, కలవల రాందాస్, విజయ్కుమార్ తదితరులు ఫోన్లో అభినందించారు.