కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 27 : పశ్చిమబెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లా కుర్సియాంగ్లో ఈ నెల 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించే 2వ ఇండో-బంగ్లాదేశ్ స్కౌట్స్ స్నేహ శిబిరానికి తెలంగాణ రాష్ట్రం తరపున జీఎం పర్సనల్ బసవయ్య ఆధ్వర్యంలో సింగరేణి స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా బసవయ్య మాట్లాడుతూ సింగరేణి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నుంచి రాజ్య పురస్కార్కి అర్హత సాధించిన 11 మంది స్కౌట్స్, ముగ్గురు యూనిట్ లీడర్లను తెలంగాణ రాష్ట్రం తరఫున ఫ్రెండ్షిప్ క్యాంపులో పాల్గొనడానికి తీసుకెళ్లామని తెలిపారు.
భారత్ నుంచి దాదాపు 300 మంది, బంగ్లాదేశ్ నుంచి 250 మంది వరకు స్కౌట్స్ అండ్ గైడ్స్, లీడర్లు క్యాంపులో పాల్గొన్నారని తెలిపారు. రెండు దేశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ మధ్య సాన్నిహిత్యం, సోదరభావం పెంపొందించడమే క్యాంపు ముఖ్యోద్దేశమన్నారు.