కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 1 : ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరుకుంటున్న తరుణంలో సింగరేణి సంస్థ ఉత్పత్తి ప్రక్రియలో దూకుడుగా ముందుకుపోతూ రికార్డులను సృష్టిస్తున్నది. గత నెలలో సింగరేణి చరిత్రలోనే ఆల్టైం రికార్డుగా 68.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసింది. గతంలో 2016 మార్చిలో చేసిన 64.7 లక్షల టన్నుల బొగ్గు రవాణాయే ఇప్పటివరకు గరిష్ట రికార్డుగా నమోదైంది. జనవరిలో మొత్తం 11 ఏరియాల నుంచి సగటున రోజుకు 39 రైలు బండ్ల చొప్పున మొత్తం 1216 రేకుల ద్వారా బొగ్గు రవాణా జరిపారు. ప్రధానంగా తెలంగాణ జెన్కోతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎక్కువ శాతం బొగ్గు రవాణా అయ్యింది. ఈ ఏడాదిలో డిసెంబర్లో గరిష్ఠంగా 1,186 రేకుల ద్వారా జరిపిన బొగ్గు రవాణాను జనవరిలో సింగరేణి అధిగమించింది.
ఓవర్ బర్డెన్ తొలగింపులో ఆల్టైం రికార్డు
బొగ్గు రవాణాతోపాటు ఓపెన్ కాస్టు గనుల్లో ఓవర్ బర్డెన్ తొలగింపులో కూడా సింగరేణి కొత్త రికార్డు సాధించింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా మంగళవారం ఉదయం షిప్టు మొదలుకొని రాత్రి షిప్టు వరకు అత్యధికంగా 16.67 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించి రికార్డు సృష్టించింది. గత నెల 30వ వరకు సాధించిన 15.75 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ ఇప్పటి వరకు గరిష్ఠ రికార్డుగా నమోదైంది. సింగరేణివ్యాప్తంగా ఉన్న 18 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే దానిపై ఉన్న మట్టిని తొలగించాల్సి ఉంటుంది. ఇందుకోసం కంపెనీ యంత్రాలతో పాటు ఆఫ్ లోడింగ్ యంత్రాల సహాయంతో ఓబీని తొలగిస్తుంటారు.
మంగళవారం ఆఫ్ లోడింగ్ ద్వారా 14.83 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్, డిపార్ట్మెంటల్ యంత్రాల సహాయంతో 1.84 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించడంతో ఈ కొత్త రికార్డు నెలకొల్పారు. జనవరిలో నిర్దేశిత లక్ష్యాల సాధనలో ముందుకుపోతున్న నేపథ్యంలో పలు ఆల్టైం రికార్డులను సాధించడంపై సంస్థ సీఎండీ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి తన అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మిగిలి ఉన్న 60 రోజుల్లో అన్ని ఏరియాలు తమకు కేటాయించిన లక్ష్యాలను రోజువారీగా సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే నిర్దేశిత 700 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని దాటగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.