టేకులపల్లి, మార్చి 17 : ఏండ్ల తరబడిగా తమ గోడును పట్టించుకునే నాథుడు లేక టేకులపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలు గోస పడుతున్నారు. బొగ్గు రవాణా లారీలు అతివేగం, అధిక లోడుతో వెళ్తుండడంతో అనేక సమస్యలు వారిని పట్టిపీడిస్తున్నాయి. వివరాల్లోకెళ్తే.. కోయగూడెం ఉపరితల గని నుంచి ఇల్లెందు, పాల్వంచ, కొత్తగూడెం తదితర ప్రాంతాలకు బొగ్గు లారీలు నిత్యం తిరుగుతుంటాయి. సింగరేణి వారి ఆధ్వర్యంలో టెండర్ల ద్వారా పలు కంపెనీలకు బొగ్గు రవాణా జరుగుతూ ఉంటుంది. అయితే టెండర్ యజమానులు నిబంధనలను పాటించడం లేదు.
లారీల లోడు విషయంలో నిబంధనల ప్రకారం 14 టైర్ల టిప్పర్లో 28 టన్నుల బొగ్గు, 12 టైర్ల టిప్పర్లో 23 టన్నుల బొగ్గు మాత్రమే రవాణా చేయాల్సి ఉంటుంది. మంచి కండీషన్ ఉన్న లారీలనే ఉపయోగించాలని సింగరేణి యాజమాన్యం టెండర్లలో పేర్కొన్నది. కానీ కేవోసీ అధికారులు, టెండర్ యజమానులు, లారీల యజమానులు కుమ్మకై నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. కండీషన్తో సంబంధం లేకుండానే లారీల్లో 32 నుంచి 40 టన్నుల బొగ్గును లోడు చేసుకొని రోడ్డుపై అతివేగంగా తిరుగుతున్నారు. దీంతో లారీ నుంచి బొగ్గు పెళ్లలు కింద పడి వాహనదారులు, పాదచారులకు ఇబ్బందిగా మారుతున్నది.
లారీలు అతివేగంగా వెళ్తుండడంతో దుమ్ము విపరీతంగా పైకిలేచి ఇళ్లల్లోకి వస్తున్నది. పెట్రాంచెలక స్టేజి, తుమ్మలచెలక స్టేజి, అంజనపాలెం, అదుగులగూడెం, దాస్తండా, రేగులతండా, బోడురోడ్డు సెంటర్, టేకులపల్లి, తడికపూడి క్రాస్రోడ్డు, గోలియాతండా గ్రామాల ప్రజలు ఈ దుమ్ముతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అనేక అనారోగ్య సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు.
ఇంతా జరుగుతున్నా ఎండ్ల తరబడి తమ గోడును ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పుకుంటున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని స్థానిక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీనిపై సింగరేణి పీవో ప్రహ్లాద్ను ‘నమస్తే’ వివరణ కోరగా లారీల్లోకి బొగ్గును లోడ్చేసే క్రమంలో కొంత హెచ్చుతగ్గులు ఉంటాయని, అధిక లోడుతో వెళ్తున్న లారీల విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దుమ్ము లేవకుండా రక్షణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
నా పేరు భూక్యా సీతమ్మ. మాది తుమ్మలచెలక స్టేజి. గత 20 సంవత్సరాలుగా కోయగూడెం ఓసీ నుంచి వివిధ ప్రాంతాలకు బొగ్గు తీసుకెళ్తున్న లారీలు, టిప్పర్లు మా ఊరు మీదుగా ప్రతిరోజు వెళ్తుంటాయి. గ్రామంలో కూడా లారీలు అతివేగంగా వెళ్తున్నాయి. అతివేగం, అధికలోడు వల్ల బొగ్గు పెళ్లలు రోడ్డుపై పడి వాటిని మరో లారీ తొక్కడంతో ఆ బొగ్గు దుమ్ము లేచి ఇంట్లో వస్తువులపై చేరుతున్నది. దుమ్మును పీల్చడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పెద్ద సార్లు పట్టించుకుంటే బాగుంటుంది.
నా పేరు తేజవత్ మోతిలాల్. మాది పెట్రాంచెలక స్టేజీ గ్రామం. కోయగూడెం ఓసీకి దగ్గర ఉన్న మా ఊరి మీదుగా ప్రతిరోజు బొగ్గు లారీలు వెళ్తుంటాయి. సింగరేణి అధికారుల దృష్టికి ఎన్నోసార్లు మా సమస్యలు తీసుకెళ్లాం. దుమ్ము లేవకుండా ప్రతిరోజు నీరు పోస్తాం, లారీల నుంచి జారిపడిన బొగ్గును తీసేస్తాం అని చెబుతున్నారే కానీ చేయడం లేదు. ప్రతి నెలా హెల్త్క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఇప్పటికైనా తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అసలు లారీలు సరిపడా లోడుతో వెళ్తే సమస్యలు తగ్గిపోతాయి.