మహా శివరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాలోని శైవాలయాలన్నీ ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాల కాంతులతో ఆలయ గోపురాలు, ప్రాంగణాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. పండుగ శోభను సంతరించుకున్న దేవాలయాలు శివనామ స్మరణ చేస్తున్నాయి. కూసుమంచిలోని కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం, తీర్థాల సంగమేశ్వరస్వామి ఆలయం, పెనుబల్లి మండలం భవన్నపాలెంలోని నీలాద్రీశ్వరుడి ఆలయం, వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం రామలింగేశ్వరస్వామి దేవాలయం, మోతే పట్టీనగర్లోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం, మధిరలోని మున్నేరు నది ఒడ్డున ఉన్న శ్రీమృత్యుంజయస్వామి ఆలయం, ఖమ్మం కాల్వొడ్డులోని గుంటుమల్లేశ్వరస్వామి ఆలయం, అన్నపురెడ్డిపల్లిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం, జూలూరుపాడు మండలం పాపకొల్లులోని కాకతీయుల కాలం నాటి ఉమా సోమలింగేశ్వరస్వామి ఆలయాలు శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి.
శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ పెరుగనున్న నేపథ్యంలో ఆలయాల నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సౌకర్యం కల్పించారు. పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు అమలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. -నమస్తే నెట్వర్క్