భద్రాచలం, ఫిబ్రవరి 21 : సంత్ సేవాలాల్ మహరాజ్ గిరిజనుల ఆరాధ్య దైవమని, ఆయనను లంబాడీలు దేవుడిగా భావించి కొలుస్తారని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్లో సంత్ సేవాలాల్ మహరాజ్ 285వ జయంతి సందర్భంగా ఆలిండియా బంజార సేవా సంఘం, భద్రాచలం ఆధ్వర్యంలో భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహించారు. పీవో, ఆర్డీవో, బంజారా కమిటీ సభ్యులతో కలిసి కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అతిథులకు కమిటీ సభ్యులు బంజారా సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. భోగ్ భండారో, వింతీ కార్యక్రమంతోపాటు బంజారా సోదరుల సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహరాజ్ ప్రకృతిని, వన్య ప్రాణులను పరిరక్షించడం ద్వారా మానవ జన్మకు సార్థకత చేకూర్చుకోవాలని సూచించే వారన్నారు. తెలంగాణ ప్రభుత్వం సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్ణయించినందున ఈ నెల 15 నుంచి 21 వరకు ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో బంజారా సోదరులు ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ మాట్లాడుతూ లంబాడీ, బంజారా తెగల కోసం సేవాలాల్ మహరాజ్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, ఈఈ తానాజీ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరునాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ ఎల్.వెంకటేశ్వర్లు, వీ.కృష్ణనాయక్, బీ.బన్సీలాల్, నాగులు, సైదులు, గోవిందు, హరిశ్ఛంద్రనాయక్, బిచ్చనాయక్, బీ.నాగేశ్వరరావు, భూక్యా శ్వేత, వీరన్న, తారాచంద్ పాల్గొన్నారు.