సత్తుపల్లి టౌన్, మార్చి 7: “మన సమాజం ఒక శిల్పం. ఆ శిల్పాన్ని చెక్కింది మహిళలు” అని, సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి పి.అరుణకుమారి అన్నారు. స్థానిక జేవీఆర్ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారిత, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో గురువారం మహిళా దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథి అరుణకుమారి మాట్లాడుతూ.. ఏదేని మంచి పనిని సాధించాలని మహిళలు గట్టిగా సంకల్పిస్తే తప్పక సఫలీకృతులవుతారని అన్నారు. వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.
వేంసూరు, మార్చి 7: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీఎస్ యూటీఎఫ్ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. డాక్టర్ ఇందుప్రియాంక, డాక్టర్ పల్లవి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు మల్లీశ్వరి, భవాని, వెటర్నరీ డాక్టర్ షఫియా, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు ఉమాసుందరిని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని సన్మానించారు.
సత్తుపల్లి టౌన్, మార్చి 7: పట్టణంలోని సింగరేణి ఉద్యోగులు గురువారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. సింగరేణి ఉద్యోగినులను ముఖ్య అతిథి, ఎమ్మెల్యే మట్టా రాగమయి సత్కరించారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, సింగరేణి పీవో వెంకటాచారి పాల్గొన్నారు.
మధిర, మార్చి7: మధిర మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్ టీ.నాగలక్ష్మీ, కోర్టు సిబ్బంది దివి హనీషా, భానవ, శ్రావణి, వందన, అనూష, దివ్య, భారతమ్మ, మహిళా న్యాయవాది తూములూరి సంధ్యను ఘనంగా సన్మానించారు.
మధిరరూరల్, మార్చి 7: మండలఃలోని దెందుకూరులో మహిళా దినోత్సవం పురస్కరించుకొని గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు.
ఎర్రుపాలెం, మార్చి 7: మండలంలోని జమలాపురం యూనియన్ బ్యాంకులో మహిళా ఖాతాదారులైన వాసిరెడ్డి శివకుమారి, సామునూరి సుశీలమ్మను బ్యాంకు మేనేజర్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో సిబ్బంది సన్మానించారు.
కొణిజర్ల, మార్చి 7: మండలంలోని బస్వాపురం గ్రామంలో మహిళా సాధికారత, మెహందీ, ముగ్గుల పోటీలను డ్వాక్రా సంఘాలు నిర్వహించాయి. విజేతలకు బహుమతులను ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీనివాసరావు అందజేశారు.
కూసుమంచి(నేలకొండపల్లి), మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా నేలకొండపల్లిలో మదర్ తెరిసా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం వేడుకలు జరిగాయి. అధ్యక్షురాలు బొల్లికొండ శ్రీలత, ఎంపీపీ వజ్జా రమ్య, ఎంపీడీవో ఎర్రయ్య, ఏపీఎం సునీత, ఎంపీటీసీ బొందయ్య, ఏపీఎం అశోక్రాణి, మహిళలు పాల్గొన్నారు.
ఖమ్మం వ్యవసాయం, మార్చి 7: మహిళా దినోత్సవం సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో గురువారం వేడుకలు నిర్వహించారు. నగరంలోని ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మహిళలకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు.
రఘునాథపాలెం, మార్చి 7: నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షురాలు బానోతు ప్రమీల పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రోటరీనగర్లో గురువారం జరిగిన వేడుకల్లో ఆమె మాట్లాడారు. అలాగే, దానవాయిగూడెం మహాత్మాగాంధీ బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలలోనూ, బూడిదెంపాడు అంగన్వాడీలోనూ వేడుకలు నిర్వహించారు.