భద్రాచలం, ఏప్రిల్ 5: భద్రాచల క్షేత్రంలో ఆదివారం జరుగనున్న మహా ఘట్టానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాములోరు సీతమ్మను పరిణయమాడే ఆ శుభ ముహుర్తం వచ్చేసింది. భద్రాచలంలో ఆదివారం ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ర్టాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలి వచ్చారు. కల్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు సమర్పించనున్నారు. జగత్కల్యాణాన్ని తిలకించేందుకు పలువురు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరుకానున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా రామాలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. అలాగే, మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభితమైన కల్యాణ మండపాన్ని అద్భుతంగా అలంకరించారు. ఎండ, ఉక్కపోతతో భక్తులు ఇబ్బందులు పడకుండా స్టేడియంలో 100 టన్నుల ఏసీతోపాటు, వంద కూలర్లు, 250 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు తిరు కల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. కల్యాణ వేడుకలో భాగంగా శనివారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది.
కల్యాణ మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం మూడు లక్షల లడ్డూలను దేవస్థానం అధికారులు సిద్ధం చేశారు. వీటిని 28 కౌంటర్ల ద్వారా భక్తులకు విక్రయించనున్నారు. అలాగే, మిథిలా స్టేడియంలో సోమవారం శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. పట్టాభిషేకాన్ని తిలకించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రభుత్వం తరఫున హాజరుకానున్నారు. అలాగే, పట్టువస్ర్తాలూ సమర్పించనున్నారు. స్వామి వారి కల్యాణం, పట్టాభిషేకం వేడుకలను తిలకించేందుకు భద్రాద్రికి తరలివచ్చే భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కల్యాణం సందర్భంగా ఎస్పీ రోహిత్రాజు ఆధ్వర్యంలో 1,800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.