ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 30:ఏటా వినాయక చవితి ఉత్సవాల్లో ఖమ్మం జిల్లాలోనే నగరంలోని బ్రాహ్మణబజారు శివాలయం గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాడు. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది కూడా భక్తులకు సరికొత్త అవతారంలో దర్శనమివ్వనున్నాడు. ఏకంగా 27 అడుగుల భారీ మట్టి వినాయకుడి ప్రతిమలో 24 కాల సర్పాల రూపాలు కలిగి ఉన్నాయి. 1994లో అప్పటి స్థానిక విద్యార్థులు తొలిసారిగా బ్రాహ్మణబజార్ శివాలయంలో చిట్టి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఉత్సవ కమిటీ సభ్యుల సంఖ్యతోపాటు ఉత్సవాల నిర్వహణలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పుష్కరకాలంగా నగరంలో అతి పెద్ద విగ్రహాలు పెట్టిన నిర్వాహకులు 2016 నుంచి అప్పటి ఖమ్మం ఎమ్మెల్యే, నేటి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచనలతో మట్టి విగ్రహాలను మాత్రమే తయారు చేయించి పూజలు చేస్తున్నారు. అంచెలంచెలుగా విగ్రహం తయారీలోనూ మార్పులు తెచ్చారు. ఈ సంవత్సరం 27 అడుగుల భారీ విగ్రహం తయారు చేయించారు. రాష్టంలో రెండో అతిపెద్ద మట్టి వినాయకుడి విగ్రహం ఇదేనని నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ మట్టి విగ్రహం 50 అడుగులు కాగా.. తరువాత రెండో స్థానంలో బ్రాహ్మణబజారు మట్టి గణపతి విగ్రహమేనంటున్నారు.
ముంబయి లాల్గణపతి తరహాలో..
ముంబయిలో ఏటా లాల్బాగ్ గణపతి నిర్వాహకులు తయారు చేయించిన తరహాలోనే బ్రాహ్మణబజారు మట్టి వినాయకుడి విగ్రహాన్ని కూడా నిర్వాహకులు తయారు చేయించారు. వినాయకుడి పాదాల కింది భాగం నుంచి శిరస్సు పైభాగం వరకూ కాలసర్పాల బొమ్మలు ఉంటాయి. ఆపైన నీలకఃఠ అవతారంలో శంకరుడూ దర్శనమిస్తుంటాడు. శివుడి తలపైనా పంచముఖ నాగసర్పాలు ఉంటాయి. ఈ విగ్రహంలో మొత్తం 24 కాల సర్పాల బొమ్మలు ఉండేలా శాస్త్ర పరంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దేశంలో విగ్రహాల తయారీలో పేరొందిన కైలాస్ మండల్ అనే కోల్కతా నిపుణుడి పర్యవేక్షణలో 12 మంది కళాకారులు మూడు నెలలపాటు శ్రమించి గణపయ్యకు తుదిరూపం తీసుకొచ్చారు. గంగానది బంకమట్టితో తయారైన ఈ విగ్రహంలో సుమారు క్వింటా నవధాన్యాలను సైతం పోసి తయారు చేయించినట్లు చెప్పారు. నిమజ్జనం సమయంలో జలచరాలకు ఆహారం అందించాలనే ఉద్దేశంతోరు సీడ్ గణపతి విగ్రహాన్ని తయారు చేయించామని చెబుతున్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం..
బుధవారం నుంచి తొమ్మిది రోజులపాటు జరిగే గణేశ్ నవరాత్రి వేడుకల్లో ప్లాస్టిక్, రసాయనాలకు తావు లేకుండా ఉత్సవాలు నిర్వహించబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వాగత తోరణాల నుంచి మొదలుకొని సైడ్ వాల్ వరకు అన్నింటినీ కేవలం క్లాత్తోనే తయారు చేయించినట్లు చెప్పారు. మండపం ఆవరణలో ఇప్పటికే హోమగుండం ఏర్పాటు చేశారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ శివాలయం ప్రధాన అర్చకులు, ఇతర రుత్వికులతో రోజుకో విధమైన హోమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఒకేసారి వందల సంఖ్యలో భక్తులు వచ్చినా దర్శనానికి అసౌకర్యం కలుగకుండా ఏర్పాటు చేశారు. 200 మంది ఉత్సవ కమిటీ బాధ్యులు వలంటీర్లుగా భక్తులకు సేవలందించనున్నారు.