కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 19: కొత్తగూడెం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్రావు వేధింపులు తాళలేకున్నామని, ఆయన ప్రవర్తన తీరు మార్చుకోవాలని, అలాగే కాలేజీ పరిధిలో యాజమాన్యం మౌలిక వసతులు కల్పించాలని మెడికల్ విద్యార్థులు మంగళవారం రెండోరోజూ ఫ్లకార్డులతో రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ఎన్నో ఆశలతో కళాశాలలో అడుగుపెట్టామని, కానీ ఇక్కడ వైద్యవిద్యకు అవసరమైన వసతులు లేవని మండిపడ్డారు. హాస్టళ్లు ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయని, సొంత భవన నిర్మాణాలకు ఒక్క అడుగైనా ముందుకు పడలేదన్నారు. కొద్దిగంటల తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖమ్మం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావుతో సహా మరో ముగ్గురు ప్రతినిధులు కొత్తగూడెం మెడికల్ కాలేజీకి వచ్చి విచారణ చేపట్టారు. వైద్య విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినుల వసతి గృహాన్ని సందర్శించారు. అక్కడి వసతులను పరిశీలించారు. త్వరలోనే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు.
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 19 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం మెడికల్ కాలేజీలో నెలకొన్న సమస్యలపై విచారించేందుకు కలెక్టర్ ప్రియాంక ఆల మంగళవారం జడ్పీ సీఈవో ప్రసూనరాణి అధ్యక్షతన విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి కె.సూర్యనారాయణను నియమించారు. సభ్యులు విచారణ పూర్తి చేసి ఈనెల 22 సాయంత్రం ఐదు గంటల్లోపు కలెక్టర్కు నివేదిక అందించాల్సి ఉన్నది.