జూలూరుపాడు, మే 22 : ప్రమాదవశాత్తు స్కూటీ దగ్ధమైన ఘటన జూలూరుపాడు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ పట్టణానికి చెందిన దంపతులు సూటీపై ఖమ్మం వెళ్లారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామ సమీపంలో సీతారామ వంతెన వద్దకు చేరుకోగానే వాహనం నుంచి ఒకసారిగా మంటలు చెలరేగాయి.
వెంటనే ప్రమాదాన్ని గుర్తించిన వారు అప్రమత్తమై స్కూటీని రోడ్డుపైనే వదిలేసి పక్కకు వెళ్లారు. ఆ వెనకాలే వస్తున్న కారులో ఆ దంపతులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే కొద్ది క్షణాల్లోనే మంటలు వ్యాప్తించడంతో రహదారిపై అటు, ఇటుగా వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపు వాహనాల రాకపోకలు సైతం స్తంభించిపోయాయి. ఈ ఘటనకు ఎండల తీవ్రత కారణమా? లేదా వాహనంలో తలెత్తిన సాంకేతిక లోపమా? అనేది తెలియాల్సి ఉంది. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే వాహన యజమానులు అకడి నుంచి వెళ్లిపోవడంతో పూర్తి వివరాలపై స్పష్టత నెలకొంది.
రుద్రంపూర్, మే 22 : ఎండల తీవ్రతతో ఇండ్లలో విద్యుత్ వినియోగం పెరిగి ఆ లోడ్ ట్రాన్స్ఫార్మర్పై పడటంతో అది కాలిపోయిన ఘటన కొత్తగూడెం పట్టణం రామవరంలో శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడంతో సింగరేణి కార్మికుల క్వార్టర్లలో విద్యుత్ వినియోగం ఎక్కువైంది.
దీంతో పెరిగిన లోడ్కు తోడు ఎండలు ఎక్కువగా ఉండటంతో ఆ ప్రభావం రుద్రంపూర్ నాలేరియా ప్రాంతంలోని పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్పై పడింది. దీంతో ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెలరేగడంతో కాలసీవాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఏరియా వర్క్షాప్ ఎలక్ట్రికల్ సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ కారణంగా మంటలు మరింత వేగంగా వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు.