సత్తుపల్లి రూరల్, సెప్టెంబర్ 24: కాంగ్రెస్ హామీలకు బడ్జెట్టే సరిపోదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. మరి ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ హామీలు ప్రజల నెత్తిన శఠగోపం పెట్టే స్కీములేనని విమర్శించారు. మండలంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని 200 మందికి రూ.1,03,60,000 విలువైన చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 2019 నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో 5,203 మందికి సుమారు రూ.26.50 కోట్ల మేర సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు.
ఈ నాలుగున్నరేళ్లలోనే ఈ ఒక్క నియోజకవర్గానికే ఇంత సాయం అందిస్తే.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సీఎంఆర్ఎఫ్ కింద ఎన్ని వేల కోట్లను ప్రజలకు ఆర్థిక సాయంగా అందించి ఉంటారో అర్థం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథానికి సీఎంఆర్ఎఫ్ చెక్కులే నిదర్శనమని అన్నారు. ప్రజలను మళ్లీ మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీములంటూ ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఆరు గ్యారెంటీ హామీలకే ఇన్ని రూ.2.95 లక్షల కోట్లు వెచ్చిస్తే.. మరి ఉద్యోగాలకు జీతాలు ఎలా ఇస్తారో, ఆసరా పింఛన్లు ఎలా ఇస్తారో, ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇలాంటి హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ నాయకులు.. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు ముందుకు వస్తున్నారంటూ దుయ్యబట్టారు. రూ.వందల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు కళ్లెదుటే కనిపిస్తున్నాయని అన్నారు. రానున్న 60 రోజులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి రాష్ట్ర ప్రగతిని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.
ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, రాయల శేషగిరిరావు, కూసంపూడి మహేశ్, వనమా వాసు, దొడ్డా హైమావతి, పగుట్ల వెంకటేశ్వరరావు, దొడ్డా శ్రీనివాసరావు, యాగంటి శ్రీనివాసరావు, పాల వెంకటరెడ్డి, కనగాల వెంకట్రావు, పాలెపు రామారావు, రెడ్డెం వీరమోహనరెడ్డి, కూసంపూడి రామారావు, కట్టా అజయ్కుమార్, చెక్కిలాల మోహనరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మట్టా ప్రసాద్, రఫీ, అంకమరాజు, అద్దంకి అనిల్, వల్లభనేని పవన్, చాంద్పాషా తదితరులు పాల్గొన్నారు.