ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 16: శివరాత్రి జాతరకు రూరల్ పరిధిలోని తీర్థాల గంగా సమేత సంగమేశ్వరుని ఆలయం ముస్తాబైంది. శుక్రవారం నుంచి ఈ నెల 21 వరకు వేడుకలు జరుగనున్నాయి. గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, సీపీ విష్ణు ఎస్ వారియర్ పనులను పర్యవేక్షించారు. జాతర పర్యవేక్షణ అధికారిగా తహసీల్దార్ టి.సుమ వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ, వైద్యారోగ్య, ఆర్అండ్బీ, పోలీస్, మత్స్య, పంచాయతీరాజ్, దేవాదాయ, ఇరిగేషన్, ఎక్సైజ్, అగ్నిమాపకశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ సిద్ధం చేశారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరకు జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాలు, రాష్ర్టాల నుంచీ భక్తులు వస్తారు.
ఈసారి సుమారు 4 లక్షల మంది భక్తులు జాతరకు వచ్చే అవకాశం ఉందని ఆలయ ఈవో శేషయ్య, అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఎమ్మెల్యే కందాళ సొంత ఖర్చులతో లైటింగ్ ఏర్పాటు చేశారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకటకృష్ణ బందోబస్తు నిర్వహించనున్నారు. జాతర సందర్భంగా ఇరిగేషన్ అధికారులు ఆలయం పక్కనే ఉన్న మున్నేరుకు సాగర్ జలాలు తరలించారు. ఏటిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల కోసం తాత్కాలిక బాత్రూంలు ఏర్పాటు చేశారు. నాలుగు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్కు స్థలాలు కేటాయించారు. పోలీసులు ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, 24 గంటల పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు 50 పైగా బస్సు సర్వీసులు నడిపించనున్నారు.
ఐదు రోజుల పాటు ఇలా..
తొలిరోజు శుక్రవారం రాత్రి 11 గంటలకు అర్చకులు ధ్వజారోహణం, గణపతిపూజ, 18న ఔపోసన, అభిషేకం, రాత్రి స్వామివారి కల్యాణం, 19న అభిషేకం, ఔపోసన, బలిహరణం, 20న అభిషేకం, ఔపోసన, సదస్యం, పూర్ణాహుతి, చివరి రోజు 21న దోపు ఉత్సవం నిర్వహిస్తారు.
త్రివేణి సంగమం..
మున్నేరు, బుగ్గేరు, ఆకేరు ఒక దగ్గర కలిసిన త్రివేణి సంగమమే తీర్థాల ప్రాంతం. త్రేతాయుగంలో మహాశివుడు మూడు నదుల సంగమానికి, ఆ ప్రాంతాన్ని చూసి ముగ్ధుడై పార్వతిదేవితో కలిసి కొన్నిరోజులు సేద తీరాడని, ఇక్కడే సంగమేశ్వరుడిగా అవతరించాడని పురాణ గాథ. అక్కడి నుంచి వందల సంవత్సరాల తర్వాత వన మూలికలను వెతుకుతూ వచ్చిన ఓ ఆయుర్వేద వైద్యుడు లింగాకారాన్ని గుర్తించాడని, ఆ తర్వాత మహాశైవక్షేత్రంగా వేల ఏళ్లుగా కొనసాగుతున్నదని గ్రామస్తుల నమ్మకం.
భక్తులకు సకల సౌకర్యాలు..
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశాం. జాతరకు సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. అందుకు తగిన విధంగానే కార్యాచరణ అమలు చేస్తున్నాం. భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ఎన్సీసీ క్యాడెట్స్, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ జాతరను విజయవంతం చేస్తాం. భక్తులు పోలీసులు, అధికారులకు సహకరించాలి.
– బెల్లం ఉమ, ఖమ్మం రూరల్ ఎంపీపీ