ఖమ్మంజిల్లాలో ఖమ్మం, నేలకొండపల్లి, వైరా, మధిర, మతేపల్లి, కల్లూరు, సత్తుపల్లి, మద్దులపల్లి, ఏనూరులలో వ్యవసాయ మారెట్లు ఉన్నాయి. కానీ, కేవలం ఖమ్మం, ఏనూరు మారెట్లలో మాత్రమే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మధిర, వైరా మద్దులపల్లి వ్యవసాయ మారెట్లలో అవకాశం ఉన్నప్పటికీ క్రయవిక్రయాలు జరగడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, బూర్గంపహాడ్, దమ్మపేట, చర్లలో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. ఇవి కేవలం చెక్పోస్టు ఆదాయంపై మాత్రమే పని చేస్తున్నాయి. కొత్తగూడెం, బూర్గంపహాడ్, ఇల్లెందు మార్కెట్లలో అవకాశం ఉన్నా క్రయవిక్రయాలు జరగడం లేదు. జూలూరుపాడు, కారేపల్లిలో సైతం కొత్తగా మార్కెట్లు నిర్మించారు. కానీ, అన్ని మారెట్లలో క్రయవిక్రయాలు జరిగితేనే ఉమ్మడి ఖమ్మంజిల్లా రైతులు సుదూర ప్రాంతాలకు వెళ్లి నష్టపోవాల్సిన దుస్థితి ఉండదు. బహిరంగ వేలం వ్యవస్థ వల్ల రైతుకు మద్దతు ధరను మించి కూడా అధిక ధర వచ్చే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడం వల్ల ఉమ్మడి ఖమ్మంజిల్లా రైతులు ్రఏటా తీవ్రంగా నష్టపోతున్నారు.
– ఇల్లెందు/ కారేపల్లి, ఆగస్టు 12
అన్నదాతలు ఆరుగాలం శ్రమించి అధిక పెట్టుబడులతో పండించిన పంటలకు మద్దతు ధర దకాలి అంటే వ్యవసాయ మారెట్లు మనుగడలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతు సంక్షేమమే లక్ష్యమనే ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో పంటలు అమ్ముకుంటూ రైతుల నడ్డివిరుస్తున్న దళారుల నుంచి రైతులను కాపాడాల్సిన బాధ్యత వ్యవసాయ మారెట్లపై ఉంది. కర్షకులు పండించి అమ్ముకునే పంటకు కచ్చితమైన తూకం, కనీస మద్దతు ధర ఇప్పించి రైతులను ఆదుకునే వ్యవస్థ వ్యవసాయ మారెటింగ్ శాఖది. ప్రస్తుత తరుణంలో ఎల్నినో ప్రభావం వల్ల సరిపడా వర్షాలు లేక పంటలు పండకపోవడం, ఒకవేళ అడపాదడపా పండిన కొద్దిపాటి పంటకు సరియైన ధర దకక రైతులు నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పంటలు సాగుచేసే రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దళారులు మోసం చేస్తున్నారు. ఖమ్మంజిల్లాలో తొమ్మిది వ్యవసాయ మారెట్లు ఉన్నా కేవలం ఖమ్మం, ఏనూరు మారెట్లలో మాత్రమే క్రయవిక్రయాలు జరుగుతుండడంతో రైతులు నష్టపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 వ్యవసాయ మారెట్లు ఉన్నా ఒక్కదాంట్లో కూడా క్రయవిక్రయాలు జరగడం లేదు. 2021-22లో కొత్తగూడెం మారెట్లో మిర్చి కొనుగోళ్లు చేపట్టారు. 2024-25లో ఇల్లెందు మెయిన్ మారెట్, టేకులపల్లి సబ్యార్డ్ మారెట్లోనూ కొనుగోళ్లు చేశారు. ప్రభుత్వ వ్యవసాయ మారెట్లలో కొనుగోళ్లు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటికైనా పాలకులు, అధికార యంత్రాంగం ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఉన్న అన్ని వ్యవసాయ మారెట్లలో పంటల క్రయవిక్రయాలు జరిగేలా చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని అన్నివర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నా ఇక్కడి రైతులకు ఒరిగిందేమీ లేదు. గత సీజన్లో ఇల్లెందు మార్కెట్యార్డులో 3,710 బస్తాలు మక్కలు తడిసి మొలకలు వచ్చి మట్టిపాలయ్యాయి. మక్కలు తడవకుండా కనీస చర్యలు తీసుకున్న నాథుడే లేడు. ఇప్పటికైనా వ్యవసాయ మార్కెట్ వ్యవస్థను పటిష్టం చేయాలి. బీఆర్ఎస్ పాలనలో కొత్తగూడెం జిల్లా కేంద్ర మార్కెట్యార్డులో మిర్చి క్రయవిక్రయాలు జరిగాయి. కాంగ్రెస్ వచ్చాక భద్రాద్రి జిల్లాలో ఒక్క మార్కెట్యార్డులో కూడా క్రయవిక్రయాలు జరగలేదు.
– బానోత్ హరిప్రియానాయక్, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే
జిల్లాలో రైతులు పలురకాల వాణిజ్య పంటలు, అపరాలు, వరిసాగు చేస్తూ జీవిస్తున్నారు. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలో క్రయవిక్రయాలు జరగకపోవడంతో పంటలను ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ మార్కెట్లకు తరలించాల్సిన దుస్థితి ఉంది. దూరాభారం దృష్ట్యా చాలామంది రైతులు స్థానికంగా దళారులకే తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోతున్నారు. ముగ్గురు మంత్రులు దృష్టి సారించి జిల్లాలో మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయాలి.
– గుమ్మడి నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే, ఇల్లెందు
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఎక్కువగా వాణిజ్య పంటలు పండిస్తారు. వాటిని అమ్మేందుకు మార్కెట్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దళారులకు తక్కువ ధరకు పంటలను అమ్ముకొని నష్టపోతున్నారు. పంటలకు మద్దతు ధర ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మార్కెట్ శాఖను బలోపేతం చేసి అన్ని మార్కెట్ యార్డుల్లో క్రయవిక్రయాలు జరపాలి. అప్పుడే రైతులకు మేలు కలుగుతుంది.
– రేపాకుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం