కూసుమంచి, డిసెంబర్ 4 : జిల్లాకు సాగర్ నీటిని అందించే పాలేరు రిజర్వాయర్ ఈ సంవత్సరం వానకాలం సీజన్కు గాను పూర్తిస్థాయిలో మునుపెన్నడూ లేని విధంగా పుష్కలంగా నీటిని అందించింది. దీంతో లక్షలాది ఎకరాల్లో వరి పండించిన రైతులు సంతోషంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాది 20 రోజులు ముందుగానే వానకాలం పంటల కోసం నీటిని విడుదల చేశారు. వాటికి తోడుగా వరుణుడు కూడా కరుణించడంతో వర్షాలు బాగా కురిసి జలాశయాలన్నీ నిండాయి. కృష్ణా బోర్డు నిర్ణయం మేరకు పాలేరు నుంచి ఈ సీజన్లో 24 టీఎంసీల నీటిని రైతులు వినియోగించుకున్నారు. వానకాలం పంటల సీజన్ పూర్తి కావడంతో ఆదివారం నీటి సరఫరాను నిలిపివేశారు. యాసంగికి వారబందీ పద్ధతిలో డిసెంబర్ 18 నుంచి 87 రోజులపాటు 21.50 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.
వానకాలం పంటల సాగు కోసం ఈ ఏడాది జూలై 21న పాలేరు నుంచి ఆయకట్టు రైతులకు సాగర్ నీటిని అధికారులు విడుదల చేశారు. అప్పటి నుంచి నిర్విరామంగా నీటిని అందించడంతో జిల్లాలోని 17 మండలాల్లోని 2.54 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పుష్కలంగా పంటలు చేతికొచ్చాయి. పాలేరు నుంచి కల్లూరు వరకు గల సాగర్ రెండో జోన్ కింద మొత్తం ఆయకట్టుకు ఈ సారి పకడ్బందీగా నీటిని విడు దల చేశారు. వర్షాలు కూడా ఎక్కువగానే కురవడంతో చివరి ఆయకట్టు రైతులకు కూడా ఈసారి సాగునీటి సమస్య ఎదురు కాలేదు. వానకాలం సీజన్లో జూలై 21 నుంచి నవంబర్ 1 వరకు పూర్తిస్థాయిలోనూ, ఆ తరువాత వారబందీ పద్ధతిలోనూ నీటిని విడుదల చేశారు. కల్లూరు వద్ద సాగర్ ప్రధాన కాలువకు గండి పడడంతో 82వ కిలోమీటరు వద్ద మరమ్మతుల కోసం వారం రోజులపాటు ఆ ప్రాంతానికి నీటి సరఫరాను నిలిపి వేశారు. తరువాత పూర్తిస్థాయిలో అందించారు. ఎడమ కాలువకు నీటిని రెండు రోజుల కింద నిలిపి వేయగా.. పాలేరులో ఆదివారం సాయం త్రం సీఈ శంకర్నాయక్ ఆదేశాలతో ప్రధాన కాలువ గేట్లు ముసివేశారు.
పుష్కలంగా పంటలు..
వానకాలం సీజన్లో ఈసారి సాగర్ ఆయకట్టులో పుష్కలంగా పంటలు పండాయి. పాలేరు నుంచి కల్లూరు వరకు రెండో జోన్ కింద, కల్లూరు నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడు వరకు మూడో జోన్ కింద ఆరుతడి పంటలకు నీటిని విడుదల చేశారు. పాలేరు రిజర్వాయర్కు వర్షాల కారణంగా వరద రావడంతో సుమారు 50 టీఎంసీల నీటి దిగువకు విడుదల చేశారు. పంటలు బాగా పండడంతో రైతులు ఆనందంగా ఉన్నారు.
యాసంగి పంటలకు నీటి షెడ్యూల్..
వానకాలం పంటల సీజన్ ముగియటంతో రైతులకు యాసంగి పంటలకు నీటి షెడ్యూల్ను నీటి పారుదల శాఖ అధికారులు ఖరారు చేశారు. అందులో వారబందీ పద్ధతిలో యాసంగికి నీటిని విడుదల చేయనున్నారు. ఈ నెల 18 నుంచి 2023 మార్చి 31 వరకు 21.54 టీఎంసీల నీటిని విడుదల చేస్తారు.