పెనుబల్లి, నవంబర్ 22: సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతానని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. సీఎం కేసీఆర్తోనే సంక్షేమ పథకాలు, సాగర్ జలాలు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. 5 నిమిషాలు ఓపికగా ఆలోచించి కారు గుర్తుపై ఓటు వేస్తే ఐదేళ్లూ మీకోసం కష్టపడి పనిచేస్తానని అన్నారు. పెనుబల్లి మండలంలో బుధవారం పర్యటించిన ఆయన.. కొత్త లంకపల్లి, లంకపల్లి, మండాలపాడు, చౌడవరం, ఏరుగట్ల, రామచంద్రపురం, భవన్నపాలెం, పీఎస్ పాలెం, ఉప్పలచెరక, లింగగూడెం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఆయనకు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మహిళలు కోలాట నృత్యాలు చేస్తూ, హరతులు పడుతూ ఎదురొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అప్పట్లో టీడీపీ జెండాను చివరి వరకు మోసింది తానేనని అన్నారు. ఆ పార్టీలోనూ, ఈ పార్టీలోనూ మంత్రి పదవులు అనుభవించి వారు ఇప్పుడు తనపైనా, బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా బురద జల్లుతున్నారని విమర్శించారు. టీడీపీ ఏమిటో, ఆ పార్టీ జెండా ఏమిటో తెలియని వారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు ఆయనకేనంటూ చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడం హాస్పాస్పదంగా ఉందని అన్నారు. నాలుగోసారి కూడా ఇక్కడి ప్రజలను గెలిపించడం ద్వారా ఈ ప్రాంతాన్ని తాను మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. అనంతరం మండలంలోని చౌడవరంలో కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు చెలికాని రాజబాబు.. సండ్రకు మద్దతు ప్రకటించడంతో ఎమ్మెల్యే ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్రావు, కనగాల వెంకట్రావు, చెక్కిలాల లక్ష్మణరావు, లక్కినేని వినీల్, భూక్యా ప్రసాద్, మందడపు అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.