ఒకప్పుడు సమస్యలతో సతమతమైన పల్లెల్లో నేడు అభివృద్ధి జాడలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఏ ఊరుకు వెళ్లినా స్వచ్ఛ పరిమళాలు వెదజల్లుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో ఒక్కొక్క అభివృద్ధి పనిని పూర్తిచేసుకుని గ్రామాలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. పారిశుధ్య సిబ్బంది పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించడంతోపాటు ప్రతి వీధినీ శుభ్రం చేసి చెత్తనంతా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అంతేకాదు, తరలించిన చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసి హరితహారం మొక్కలకు వినియోగిస్తున్నారు.
మురుగు కాల్వలు శుభ్రం చేయడంతోపాటు దోమల నివారణ మందు చల్లుతున్నారు. గ్రామాల్లో ఏ వీధికి వెళ్లినా.. సీసీ రోడ్లతో పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. కొన్ని పల్లెలు వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకుని స్వచ్ఛతలో ముందు వరసలో నిలిచాయి. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీటి సరఫరాతో నీటి కష్టాలు తీరాయి. నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలతో పచ్చందాలు కనువిందు చేస్తున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదం పంచుతున్నాయి.
వైకుంఠధామాల నిర్మాణంతో ఆఖరి మజిలీ అవస్థలు తప్పాయి. మారుమూల పల్లెల్లోనూ విద్యుత్ కాంతులు జిగేల్మంటున్నాయి. ఇలా ఎన్నో సౌకర్యాలు పల్లెల్లో ఒనగూరడంతో కేంద్ర ప్రభుత్వం ఏ క్యాటగిరీ కింద అవార్డును ప్రకటించినా.. తెలంగాణ పల్లెలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి.
కూసుమంచి, డిసెంబర్ 1: ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే తెలంగాణలోన.. నా తెలంగాణాలోన’ అని ఓ వాగ్గేయకారుడు ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ఎలుగెత్తిచాటాడు. అప్పుడు పల్లెలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. గ్రామస్తులు మౌలిక వసతులు లేక ఇబ్బందిపడేవారు. ఉద్యమకారుడిగా స్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి గ్రామాభివృద్ధిపై దృష్టి సారించారు. ప్రతిష్ఠాత్మకంగా ‘పల్లె ప్రగతి’ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీంతో నిత్యం సమస్యలతో కునారిల్లే గ్రామాలు ఇప్పుడు ప్రగతి బాట పట్టాయి. ప్రతి పంచాయతీలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్యార్డు, ట్రాక్టర్, ట్యాంకర్ అందుబాటులోకి వచ్చాయి. పక్కాగా పారిశుధ్య నిర్వహణ అమలవుతున్నది.
వ్యవసాయశాఖ అధికారులు గతంలో మండల కేంద్రాల వేదికగా పనిచేసేవారు. గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించాలంటే ఇబ్బంది పడేవారు. లేదా రైతులే మండల కేంద్రాలకు రావాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపారు. ప్రతి జిల్లాను క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో ఓ రైతువేదిక నిర్మించారు. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా 129 క్లస్టర్ల పరిధిలో 129 రైతువేదికలు నిర్మించారు. ఒక్కో నిర్మాణానికి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు విడుదల చేశారు. రఘునాథపాలెంలో మంత్రి అజయ్కుమార్, కూసుమంచిలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి సొంత నిధులతో రైతువేదికలు నిర్మించారు. ఇప్పుడు వ్యవసాయశాఖ అధికారులు సరాసరి గ్రామాలకు వెళ్లి రైతువేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఏటా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా 589 నర్స రీలు ఏర్పాటయ్యాయి. గతంలో మొక్కలు కావాలంటే ఏపీలోని గోదావరి జిల్లాలకు వెళ్లాల్సి వచ్చేది. ఉపాధి పథకంలో భాగంగా అధికారులు మన పల్లెల్లోని నర్సరీల్లో సుమారు 60 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఇప్పటికే అనేక విడతల్లో నాటిన హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు పల్లెల్లో పచ్చందాలు పరుచుకున్నాయి. పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొక్కలకు నీరు పోసేందుకు, పారిశుధ్య కార్మికులు చెత్తను సేకరించేందుకు ప్రతి పల్లెకు ట్రాక్టర్, ట్యాంకర్ అందుబాటులోకి వచ్చాయి. సిబ్బంది తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. అక్కడ తయారైన కంపోస్ట్ ఎరువును హరితహారం మొక్కలు ఎదగడానికి వేస్తున్నారు. ప్రతి గ్రామంలో మంగళ, శుక్రవారాల్లో డ్రై డే అమలవుతున్నది. ప్రభుత్వం ప్రతి పల్లెలో రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల నిధులతో అన్ని వసతులతో వైకుంఠధామం నిర్మించింది. జిల్లావ్యాప్తంగా 589 వైకుంఠధామాలు అందుబాటులోకి వచ్చాయి.
జిల్లావ్యాప్తంగా మొత్తంగా 750 హెబిటేషన్లు ఉండగా ఇప్పటికే 460 గ్రామాల్లో క్రీడా మైదానాలకు స్థలాలు సమకూరాయి. వీటిలో ఇప్పటికే 430 మైదానాలు యువతకు అందుబాటులోకి వచ్చాయి. డీఆర్డీవో అధికారులు మిగిలిన గ్రామాల్లోనూ క్రీడామైదానాలు ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ ఎప్పటికప్పుడు పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. సత్వరం మైదానాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
జిల్లాలోని ప్రతి పంచాయతీలో పల్లె ప్రగతి పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమిస్తున్నాం. ప్రభుత్వం లక్ష్యాలను నెరవేరుస్తున్నాం. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీలు, ట్రాక్టర్లు, ట్రాలీలు అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ ఇప్పుడు పల్లెల ఆస్తులుగా మారాయి. వాటి నిర్వహణను ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
– విద్యాచందన, డీఆర్డీవో, ఖమ్మం
పల్లె ప్రగతిలో భాగంగా మా గ్రామంలో వైకుంఠధామం, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, చెత్త సేకణకు ట్రాక్టర్, ట్యాంకర్, డంపింగ్ యార్డు, క్రీడామైదానం అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. పల్లెలు ప్రగతి బాటలో పయనిస్తున్నాయి.
– దండా పుల్లయ్య, సర్పంచ్, రాజేశ్వరపురం