బోనకల్లు, జూన్ 18 : విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అలాగే అంతరాయం ఏర్పడితే వెనువెంటనే గుర్తించి మరమ్మతులు చేసేందుకు రియల్ టైం ఫీడర్ మేనేజ్మెంట్ సిస్టం (RTFMS), ఫాల్ట్ పాస్ ఏజ్ ఇండికేటర్స్ (FPI) లు ఎంతో ఉపయోగపడతాయని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం జానకిపురం సబ్ స్టేషన్లో RTFMS, FPI వ్యవస్థలను మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఈ ఆధునిక పరిజ్ఞానాన్ని NPDCL, SPDCL రెండు సంస్థల పరిధిలో అమలు చేయనున్నట్టు తెలిపారు.
ఎక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందో కంప్యూటర్ ద్వారా గుర్తిస్తారని, NPDCL, SPDCL కార్యాలయంలోని డాష్ బోర్డు ద్వారా కూడా రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ సమస్య ఏర్పడినా గుర్తించే అవకాశం ఈ ఆధునిక వ్యవస్థల ద్వారా వీలవుతుందన్నారు. రియల్ టైం ఫీడర్ మేనేజ్మెంట్ సిస్టం అనేది సబ్ స్టేషన్లలోని ఫీడర్ల పర్యవేక్షణ, నియంత్రణ, రక్షణ, రియల్ టైం ప్రాతిపదికన సమాచారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన ప్రతి సమాచారం కంప్యూటర్ ఆధారితంగా నమోదు అవుతుందన్నారు. ఈ వ్యవస్థ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అలాగే ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో సమస్య ఏర్పడితే విద్యుత్ సిబ్బంది వెంటనే ప్రతిస్పందించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు.
రాష్ట్రంలోని 100 సబ్ స్టేషన్లలో ఈ వ్యవస్థకు మొదటగా శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మరో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఫాల్ట్ పాసెజ్ ఇండికేటర్ అనేది విద్యుత్ సరఫరాలో సమస్యను అతి త్వరగా గుర్తించడానికి, ఏ ప్రాంతంలో సమస్య ఏర్పడిందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ వ్యవస్థ ద్వారా విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని గుర్తించే సమయం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. విశ్వసనీయతను మెరుగుపరచడానికి, విద్యుత్ సరఫరాను అతి త్వరగా పునరుద్ధరించడంలో సహాయపడుతుందన్నారు. మొదటి దశలో 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన 33KV & 11KV ఫీడర్లలో లోపాలను త్వరగా గుర్తించి సరఫరాను పునరుద్ధరించడానికి 1000 FPI లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి పాల్గొన్నారు.
Bonakal : మెరుగైన విద్యుత్ సేవలకు ఆర్టీఎఫ్ఎంఎస్, ఎఫ్పీఐ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క