కొత్తగూడెం క్రైం, ఫిబ్రవరి 20 : ప్రత్యక్షంగా ప్రజలకు సేవలు అందించడంలో పోలీసుల పాత్ర చాలా కీలకమైందని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో జిల్లా నుంచి ఉత్తీర్ణులైన 75 మంది అభ్యర్థులకు ఎస్పీ మంగళవారం బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ కానిస్టేబుల్ విభాగంలో 27 మంది పురుషులను సైబరాబాద్ (సీటీసీ) ట్రైనింగ్ సెంటర్కు, 18 మంది మహిళలను వరంగల్ పీటీసీ, ఆర్మ్డ్ రిజర్వ్డ్ కానిస్టేబుల్ విభాగంలో 22 మంది పురుషులను యూసుఫ్గూడలోని మొదటి బెటాలియన్కు, 8 మంది మహిళలను టీఎస్పీఏ ట్రైనింగ్ సెంటర్లకు తరలించినట్లు చెప్పారు.
పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించాల్సిన ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, అందుకోసమే క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ తరగతుల్లో అందరూ మంచి ప్రావీణ్యాన్ని సాధించి విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఏఆర్) విజయ్బాబు, అడ్మిన్ ఆర్ఐ బోలెం రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.