ఖమ్మం వ్యవసాయం/ పెనుబల్లి, జూలై 10: నీరుపెట్టి నారుమడులు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. వర్షాధారంగా కూలీలతో నాట్లు వేయాల్సిన పనిలేదు. ఎరువుల వినియోగమూ ఎక్కువగా ఉండదు. దుక్కి దున్నితే చాలు.. కరివేద పద్ధతిలో వరి సాగు చేస్తే సరిపోతుంది. తక్కువ సమయంలో పంట చేతికొస్తుంది. ఆశించిన మేర దిగుబడి వస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా.. కేవీకే శాస్త్రవేత్తల సూచన మేరకు జిల్లాలో 5వేల మంది రైతులు వెదజల్లే సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే దున్నిన దుక్కుల్లో విత్తనాలు చల్లగా.. మరికొందరు నానబెట్టిన విత్తనాలను భూమిలో నాటుతున్నారు. వేంసూరు మండలానికి చెందిన ఓ ఆదర్శ రైతు స్ఫూర్తిగా జిల్లా రైతులు ఐదేళ్ల నుంచి కరివేద సేద్యానికి సై అంటున్నారు.
ఖమ్మం జిల్లాలో కరివేద (వెదజల్లే) పద్ధతిలో వరి సాగు ఏటా పెరుగుతున్నది. ప్రస్తుత సీజన్లో ఆశించినంత మేర వర్షపాతం నమోదు కాకపోవడంతో జిల్లా కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తల సలహాలు సూచనలు మేరకు జిల్లాకు చెందిన 5 వేల మందికి పైగా రైతులు వెదజల్లే పద్ధతిలో వరి సాగు ప్రారంభించారు. కొందరు దుక్కులు దున్నిన భూముల్లో విత్తనాలు వేయగా మరికొందరు దమ్ము చేసిన భూమిలో నానబెట్టిన విత్తనాలను నాటుతున్నారు. ఐదేండ్ల క్రితం వేంసూరు మండలం కందుకూరుకు చెందిన ఆదర్శ రైతు గొర్ల సత్తిరెడ్డి వెదజల్లే పద్ధతిలో వరి సాగు ప్రారంభించారు. మంచి దిగుబడులు సాధించడంతో ఆయన స్ఫూర్తితో ఇతర రైతులూ వెదజల్లే పద్ధతిలో సాగు చేపడుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు, వైరా కేవీకే శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
సాగు విధానం ఇలా..
చెరువులు, బావుల కింద దమ్ముకు సరిపడా నీరు అందుబాటులో లేని సందర్భంలో వెద్దజల్లే పద్ధతి మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఈ పద్ధతిలో సీజన్ ఆరంభంలోనే పొడి దుక్కులు దున్నుకొని లేదా సీడ్ డ్రిల్ చేసి గానీ రైతులు విత్తనాలను విత్తుకోవచ్చు. వెద సాగుకు 1001, బీపీటీ 5204, 1156 వంటి విత్తన రకాలు అనుకూలంగా ఉంటాయి. విత్తనాలను 30 సెంటీమీటర్ల లోతు ఉండే విధంగా సాలు వెనుక సాలు దున్నుకోవాలి. నాట్ల తర్వాత ఎకరానికి ఒక లీటర్ నీటిలో సరిపడా పెండీ మిథాలిన్ అనే కలుపుమందును పిచికారీ చేయాలి. 20-25 రోజుల వ్యవధిలో కలుపు ఉధృతిని బట్టి బిస్ పైరీ, బాక్ సోడియం 100-120 మి.లీ పిచికారీ చేయాలి.
ప్రయోజనాలు ఇలా..
వెద్దజల్లే పద్ధతిలో తక్కువ వర్షపాతం నమోదైన సీజన్లోనూ వరి సాగు చేయొచ్చు. తక్కువ నీటి వనరులతోనే పంటను కాపావడుకోవచ్చు. నాణ్యమైన దిగుబడి సాధించొచ్చు. తద్వారా రెండో పంటను సకాలంలో సాగు చేయవచ్చు. ఈ పద్ధతిలో కూలీ ఖర్చులు చాలా తక్కువ. పెస్టిసైడ్స్, ఎరువుల వినియోగమూ తక్కువే. తక్కువ పెట్టుబడుల కారణంగా రైతు అధికంగా లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నది. సాగుకు మాగాణితోపాటు మెట్ట భూములూ అనుకూలమే.
5వేల ఎకరాలకు పైగా..
జిల్లా రైతాంగం ఏటా సంప్రదాయ పద్ధతితోపాటు ట్రాన్స్ప్లాంటేషన్, డ్రమ్ సీడ్, వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. వానకాలంలో రైతులు అత్యధికంగా కల్లూరు మండలంలో 2,346 ఎకరాలు, వేంసూరు మండలం 977, తల్లాడ మండలం 502, పెనుబల్లి మండలం 490, సత్తుపల్లి మండలం 269, కామేపల్లి మండలం 177 ఎకరాలు, చింతకాని మండలం 110 ఎకరాలు, కొణిజర్ల మండలం 115 ఎకరాలు, ముదిగొండ మండలంలో 126 ఎకరాల చొప్పున వరి సాగవుతున్నది. ఇలా జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 5,228 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో సాగు చేపట్టారు.
వెదజల్లే పద్ధతిలో..
ఈ పద్ధతిలో వరి సాగు చేస్తే ఎకరాకు 36 బస్తాల (ఒక బస్తా-75 కిలోలు) దిగుబడి వస్తుంది. ధాన్యం ఒక క్వింటాకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర రూ.2,040. ఈ చొప్పున 36 బస్తాలకు వచ్చే ఆదాయం రూ.63,000. పెట్టుబడి మొత్తం రూ.15,000 పోను రైతుకు సుమారు రూ.47,500 పైగా ఆదాయం వస్తుంది. వెద జల్లే పద్ధతిలో పెట్టుబడి తక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది.
సాధారణ పద్ధతిలో..
ఈ పద్ధతిలో సాగు చేస్తే ఎకరాకు 36 బస్తాల (ఒక బస్తా-75 కిలోలు) దిగుబడి వస్తుంది. ధాన్యం ఒక క్వింటాకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర రూ.2,040. ఈ చొప్పున 35 బస్తాలకు వచ్చే ఆదాయం రూ.64,800. పెట్టుబడి మొత్తం రూ.26,350 పోను రైతుకు సుమారు రూ.38,400 వేలకు పైగా ఆదాయం వస్తుంది.
వెద పద్ధతే మేలు..
నేను ప్రతి సీజన్లో పదెకరాల్లో వరి సాగు చేస్తాను. కొన్నేళ్ల వరకు నేను సాధారణ పద్ధతిలో వరి సాగు చేశాను. అప్పుడు పొలంలో నాట్లు వేయించడం, కూలీలను సమకూర్చుకోవడం, వారికి కూలి చెల్లించడం కష్టతరంగా అనిపించింది. ఎన్నో వ్యయప్రయాసలు, కష్టనష్టాలుకు ఓరిస్తే తప్ప సాగు పూర్తయ్యేది కాదు. అంతా చేస్తే దిగుబడులు పెద్దగా ఆశాజనకంగా ఉండేది కాదు. అందుకే ఇప్పుడు వెదజల్లే పద్ధతిని ఎంచుకున్నాను. వెద్ద పద్ధతే రైతులకు మేలు.
– వెలివెలి కృష్ణయ్య, రైతు, పెనుబల్లి
వెదసాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
వరి సాగులో డైరెక్ట్ సీడ్ పద్ధతిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఏటా ఈ పద్ధతిలో సాగు చేపట్టే వారిసంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా వెద సాగు చేస్తున్న జిల్లాల్లో ఖమ్మం జిల్లా టాప్లో ఉన్నది. జిల్లాలో సాగు చేపట్టిన విధానాన్ని పొరుగు జిల్లాల రైతులూ ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం మరింత పెరగనున్నది.
– ఎం.విజయనిర్మల, డీఏవో, ఖమ్మం
తక్కువ ఖర్చుతో సాగు..
సాధారణ పద్ధతిలో వరి సాగు ఖర్చుతో కూడుకున్నది. ఖర్కు తక్కువగా పెట్టి మంచి దిగుబడులు సాధించాలంటే వెద సాగు మంచి మార్గం. ప్రస్తుత సీజన్లో అడపా దడపా వానలు పడుతున్నాయి. నేను నాకున్న ఎకరంన్నరలో వడ్లు చల్లాను. వానలు ఆశాజనకంగా కురిస్తే ఇక పంటకు ఢోకా ఉండదు.
– మేడా కృష్ణయ్య, రైతు, కొత్తకారాయిగూడెం, పెనుబల్లి మండలం