కూసుమంచి, ఫిబ్రవరి 6 : ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో నీరు లేనందున.. ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకునేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసం ముందస్తుగా పాలేరు రిజర్వాయర్ను సందర్శించామని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మిషన్ భగీరథ అధికారి సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. మంగళవారం కూసుమంచి మండలం జీళ్లచెరువులోని మిషన్ భగీరథ ప్లాంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షలాది మందికి తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్ను పరిశీలించి వివరాలు తీసుకున్నామని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు వేసవిలో ప్రతి గ్రామంలో తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పాలేరుకు సాగర్ నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి నీరు వచ్చే అవకాశాలను కూడా పరిశీలిస్తామని, మహబూబాబాద్ జిల్లా మద్దివంచ చెక్డ్యాం నుంచి నీటిని తరలించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. శుద్ధి చేసిన జలాలను పాలేరు నుంచి ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలోని 2,439 గ్రామాలకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పాలేరు రిజర్వాయర్ నీటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఈఎన్సీ కృపాకర్రెడ్డి, సీఈలు శ్రీనివాస్, లలిత, చెన్నారెడ్డి, ఎస్ఈలు రాములు, సదాశివకుమార్, మూడు జిల్లాల ఈఈలు, డీఈలు, క్వాలిటీ కంట్రోల్ అధికారులు పాల్గొన్నారు.
వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎలా ఎదుర్కోవాలి.. ఉన్న నీటిని ఎలా వాడుకోవాలి.. పాలేరులో నీటి సామర్థ్యం వంటి అంశాలపై ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల మిషన్ భగీరథ అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా.. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, ఈఎన్సీ కృపాకర్రెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల పరిస్థితి ఆశాజనకంగా లేని కారణంగా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నాలుగు నెలలపాటు అంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీటిని అందించేలా సమర్థంగా పనిచేయాలన్నారు.
పాలేరు రిజర్వాయర్ కింద ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ ప్రాజెక్టులు, ప్లాంట్లను సుమారు రెండున్న గంటలపాటు సందీప్కుమార్ సుల్తానియా పరిశీలించారు. పాలేరు చేరుకున్న సుల్తానియా.. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు మిషన్ భగీరథ తాగునీటిని అందించే పాలేరు రిజర్వాయర్ నీటి మట్టాన్ని, పంపింగ్ విధానాన్ని, జీళ్లచెరువులో నీటి శుద్ధి ప్రాజెక్టును, మంచినీటి పరీక్షలు చేసే ల్యాబ్ను, గుర్వాయిగూడెం గుట్టమీద గల మంచినీటి ట్యాంక్ను పరిశీలించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు పుష్పలత, వంశీ, కరుణాకర్రెడ్డి, డీఈ మురళీకృష్ణ, ఏఈలు రంజిత్, వసంత్, ఎల్ఎన్టీ ఇంచార్జి బీఎల్ రెడ్డి, ఎంపీడీవో రమాదేవి, ఎంపీఈవో రామచందర్రావు, సెక్రటరీ నరేశ్ పాల్గొన్నారు.