మామిళ్లగూడెం, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చిన ధరణి పోర్టల్ సేవల ద్వారా ఖమ్మం జిల్లాలో దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిషారం లభిస్తున్నదని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదివారం తెలిపారు. ఇప్పటివరకు పరిష్కారమైన సమస్యలను ఆయన వివరించారు. ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామ రైతులకు ఇటీవలే కొత్త పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలో సర్వే నంబర్ 58లో 1977వ సంవత్సరంలో భూదాన్ భూమి 313 ఎకరాలను 75మంది రైతులకు అందించడం జరిగింది. ఈ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా జారీ చేసియుండగా 2018వ సంవత్సరంలో జరిగిన భూ రికార్డుల నవీకరణలో రైతుల భూములు నిషేధిత జాబితాలోకి చేర్చడం వలన పాస్ పుస్తకాల జారీ నిలిపివేశారు. అప్పటినుంచి ఆ రైతులు పాస్ పుస్తకాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి అప్పటి ఉత్తర్వుల ప్రతులను తెప్పించి పాత పుస్తకాలు కలిగిన రైతులకు, చనిపోయిన రైతుల వారసులకు రికార్డుల ఆధారంగా రెవెన్యూ యంత్రాంగంతో పరిశీలన చేయించి 197 ఎకరాలకు గాను, ఎస్సీ , ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 86మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలను అందించినట్లు కలెక్టర్ వివరించారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటివరకు 16,947 క్లయిమ్లకు 15,583 పరిషరించినట్లు తెలిపారు. వ్యవసాయ భూమి క్రయ విక్రయాలు పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయని, తహసీల్దార్లు సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు నిర్వర్తిస్తూ స్లాట్ బుకింగ్ అయిన 16,426 సేల్ రిజిస్ట్రేషన్స్, 9,606 గిఫ్ట్ రిజిస్ట్రేషను, 11వందలు నాలా కన్వర్షన్స్ దరఖాస్తులను పరిషరించి, సంబంధిత యజమానులకు డాక్యుమెంట్లను అందించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.