– ఖమ్మం డీఎండబ్ల్యూఓ మహమ్మద్ ముజాహిద్
కారేపల్లి, ఫిబ్రవరి 03 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఖురాన్ పఠనం పూర్తి చేసిన(ఖతం అల్-ఖురాన్/హిఫ్జ్) విద్యార్థులను మంగళవారం ఘనంగా సన్మానించారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి(డీఎండబ్ల్యూఓ) మహమ్మద్ ముజాహిద్ ముఖ్య అతిథిగా హాజరై పవిత్ర ఖురాన్ పారాయణాన్ని పూర్తిచేసిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేసి వారి కృషిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే ఖురాన్ నేర్చుకున్న విద్యార్థులను అభినందించడం ద్వారా వారిలో ఆధ్యాత్మికతను, క్రమశిక్షణను పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు.
విద్యార్థులు ఆధునిక విద్యను అభ్యసిస్తూనే ఖురాన్ కంఠస్థం చేయడం అభినందనీయమన్నారు. ఖురాన్ పూర్తి చేయడం అనేది విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతుందన్నారు. అంతకుముందు విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా తయారు చేసి ప్రదర్శించిన ఆవిష్కరణలను ఆయన వీక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డి.సావిత్రి, అరబ్ ఉపాధ్యాయురాలు మీరా సుల్తానా, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రాణి, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.