దమ్మపేట రూరల్, జూలై 13: బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్ జారీ చేసి, ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్తో రికార్డుల్లో భూమిని బదలాయించిన విషయంలో కొత్తగూడెం ఆర్డీవో మధు దమ్మపేట తహసీల్ కార్యాలయంలో సోమవారం విచారణ నిర్వహించారు. తహసీల్దార్ రాంనరేశ్ సెలవులో ఉండడంతో జీపీవో అనంతమ్మ, ఆర్ఐ వీరాస్వామి, భూభారతి ఆపరేటర్ రమేశ్, బాధితుడు మళ్లా సత్యంలను ఆర్డీవో విచారించారు. ఆర్ఐ, జీపీవో నుంచి వివరణను రాతపూర్వకంగా తీసుకున్నట్లు సమాచారం. భూ బదలాయించిన ఒరిజినల్ ఫైల్ తహసీల్దార్ వద్ద ఉందని ఆపరేటర్ చెప్పగా.. ‘ఒరిజినల్ ఫైల్ నీ దగ్గరే ఉండాలి కదా?’ అంటూ మందలించినట్లు తెలిసింది. ఫొటో కాపీ ఫైల్ను ఆర్డీవో తీసుకున్నట్లు తెలిసింది. కాగా, మరోసారి వచ్చి విచారణ చేస్తానని తనను కలిసిన విలేకరులతో ఆర్డీవో అన్నారు.
బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్ జారీ చేసి, ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్తో రికార్డుల్లో భూమిని బదలాయించిన ఘటనలో ఆర్డీవో మధు విచారణ ప్రారంభించిన రోజే మరో అక్రమం బయటపడింది. ముష్టిబండ రెవెన్యూలో సర్వే నంబర్లు 178/ఋ/1/2లో 2.02 ఎకరాలు, 182/1/ ఋ/2/2లో 1.39 ఎకరాలు కలిపి మొత్తం 4.01 ఎకరాలను వేర్వేరు కులాల మధ్య భాగ పంపిణీ (పార్టేషన్) చేసి ఖాతా నంబరు 60323తో కొత్త పట్టాదారు పాస్పుస్తకం టీ27100170592 జారీ చేసిన ఘటన వెలుగుచూసింది. పసుపులేటి మోహన గంగా భవానీ నుంచి నల్లగుళ్ల స్వరూప రాణికి భూమిని 2026 మార్చి 10న భూమిని బదలాయించారు. ఏజెన్సీలో సక్సేషన్ (పట్టాదారు చనిపోయిన తరువాత అతడి రక్త సంబంధీకులకు భూ బదిలీ) ద్వారా మాత్రమే భూముల బదలాయింపులు జరగాలని ఏజెన్సీ చట్టంలో నిబంధన ఉంది. అయినప్పటికీ ఈ నిబంధనను పక్కనపెట్టి అక్రమంగా భూమిని బదలాయించిన రెవెన్యూ అధికారుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.