నియమ నిష్టలతో నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ను గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గత నెల 12వ తేదీ నుంచి ప్రారంభించిన రంజాన్ ఉపవాస దీక్షలను బుధవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ముగించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రంజాన్ పండుగ కోసం సిద్ధం చేసిన ఈద్గాలు, మసీదుల వద్దకు గురువారం ఉదయమే నూతన వస్ర్తాలు ధరించి వెళ్లిన ముస్లింలు భక్తిభావంతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు ఖురాన్ పఠనం చేసి సారాంశాన్ని వివరించగా.. ముస్లింలు శ్రద్ధగా విన్నారు. తర్వాత ముస్లింలు నిరుపేదలకు దాన ధర్మాలు చేశారు. అనంతరం పలువురు రాజకీయ ప్రముఖులు ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొని ఆలింగనం చేసుకొని ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఖమ్మం నగరంలోని గొల్లగూడెం ఈద్గా వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం నగరంలో పర్యటించిన ఎంపీ నామా, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ పలువురు ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి, కల్లూరులోని ఈద్గా వద్ద మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, బీఆర్ఎస్ నేత కోనేరు చిన్ని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈద్గాల వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు. -నమస్తే తెలంగాణ నెట్వర్క్