ఖమ్మం, మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అలవికాని హామీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసగించి అధికారాన్ని చేజిక్కించుకున్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో విలేకరులతో హరీశ్రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతుల కాళ్లు మొక్కి వందరోజుల్లో రుణమాఫీ, రైతుభరోసా రూ.7,500, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని నమ్మించి మోసగించిందన్నారు. వడ్లకు రూ.500 బోనస్ అడిగిన పాపానికి రైతులకు అవగాహన లేక మాట్లాడుతున్నారని సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అనడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులను అవహేళన చేసే హక్కు మంత్రికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆర్నెళ్లు ఐనా పాలనపై పట్టు సాధించలేక ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందన్నారు. ఎన్నికలకు ముందు అన్ని పంటలకూ రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం సన్నవడ్లు పండించిన రైతులకేనంటూ మరోమారు మోసగిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభ్వుత్వంలో పూటకో మంత్రి.. రోజుకో తీరుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సన్నరకాలను మాత్రమే పండించాలని మంత్రులు చెప్తున్న తీరు.. నోటితో మాట్లాడి..
నోసటితో వెక్కిరించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. సన్నాలను పండిస్తే పంటకు తెగులెక్కువ, దిగుబడి తక్కువగా వస్తుందన్నారు. అంతేకాక దొడ్డు వడ్లు 120రోజుల్లో దిగుబడి వస్తే.. సన్నవడ్లు 150రోజుల్లో పండుతాయన్నారు. రాష్ట్రంలోని 99శాతం మంది రైతులు దొడ్డు వడ్లను పండిస్తారని కేవలం ఒక్కశాతం మాత్రమే సన్నవడ్లను పండిస్తారని వివరించారు. ఇది కేవలం రైతులను అవమానపరచడమే అన్నారు. మంత్రులకు ఆర్నెళ్లకే అహంకారం పెరిగిపోయిందన్నారు. పాలనపై పట్టులేకపోవడంతో రైతులు ఇప్పటికే క్రాప్హాలీడే ప్రకటించారని, వ్యవసాయానికి సరిపడా నీళ్లు అందించకపోవడంతో వేసిన పంటలన్నీ ఎండిపోయాయన్నారు. ఫలితంగా జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వానకాలం పంటకైనా సీజన్కు ముందుగా పెట్టుబడి సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనుగోలుకు అవసరమైన రైతుభరోసా సాయాన్ని జూన్లోనే అందించాలన్నారు. జూలైలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రైతులతో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చి ముట్టడిస్తామని హెచ్చరించారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గతంలో సీఎం కేసీఆర్తో మాట్లాడి గోదావరి జలాలను తెచ్చిన విషయాన్ని హరీశ్రావు గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక నీళ్లు ఇయ్యలేక పంటలను ఎండబెట్టిందన్నారు. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలం గడపడం కాదని పాలనపై దృష్టిపెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని హెచ్చరించారు. ఆయన వెంట ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు ఉన్నారు.