ఖమ్మం వ్యవసాయం, మే 18: వచ్చే నెల రెండోవారం నుంచి వానకాలం సీజన్ ప్రారంభం కానున్నది. దీంతో నెలరోజుల ముందుగానే జిల్లా వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. సాగు అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం జిల్లాలోయాసంగి సాగుకు సంబంధించి ధాన్యం, మక్కజొన్న కొనుగోళ్లు జరుగుతన్నాయి. ఓ వైపు కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగతుండగానే మరోవైపు వానకాలం సీజన్ సాగు పనులపై ఆ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారుల నుంచి క్షేత్రస్థాయి సమాచారం తీసుకున్న జిల్లా వ్యవసాయ శాఖ.. సదరు నివేదికను రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపింది. ఈ నివేదికను రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆమోదించడమే తరువాయి. దీంతో అందుకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ రూపొందించే పనిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. వచ్చే సీజన్లో జరిగే సాగును దృష్టిలో ఉంచుకొని అందుకు అవసరమైన ఎరువులను జిల్లా కేంద్రంలో నిల్వ చేసుకునేందుకు గాను మార్క్ఫెడ్కు ఇండెంట్ అందించింది. అదే విధంగా పచ్చిరొట్ట, వరి, పెసర, కంది, మొక్కజొన్న విత్తనాల కోసం తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్కు కూడా ఇండెంట్ పంపింది. ఈ ఇండెంట్ను అందుకున్న సీడ్స్ కార్పొరేషన్ అధికారులు అందుకు అనుగుణంగా ఆయా గ్రామాల్లో ఉన్న సహకార సొసైటీలకు పచ్చిరొట్ట విత్తనాలను తరలిస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో సొసైటీల్లో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ప్రారంభం కానున్నది.
పెరుగనున్న సాగు విస్తీరణం
గత వానకాలం సీజన్తో పోల్చుకుంటే ఈ ఏడాది జిల్లాలో వానకాలం సాగు భారీగా పెరిగే అవకాశం ఉంది. జిల్లా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం దాదాపు 66 వేల ఎకరాల విస్తీర్ణం అధికంగా జరుగనున్నది. గత వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అయితే ఈ ఏడాది మాత్రం సుమారు 6,16,067 ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీంతో అదనంగా దాదాపు 66 వేల ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయి. ప్రధాన పంట వరి 2,90,000 ఎకరాలు, మొక్కజొన్న 3,500 ఎకరాలు, పెసర 21 వేల ఎకరాలు, పత్తి 2.15 లక్షల ఎకరాలు, మిరప 80 వేల ఎకరాల్లో సాగు కావచ్చని వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడం, ఈ సంవత్సరం సైతం సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం వంటి కారణాల వల్ల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.
సాగుకు అగుణంగా ఎరువులప్రణాళిక
రానున్న వానకాలం సీజన్ సాగుకు వివిధ రకాల ఎరువులు ఎంతమేరకు అవసరమవుతాయో వ్యవసాయ శాఖ అధికారులు అధికారులు అంచనా వేశారు. దాని ఇండెంట్ను మరికొద్ది రోజుల్లోనే మార్క్ఫెడ్కు అందజేయనున్నారు. ప్రస్తుతం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఉన్న ఎరువులతోపాటు మిగిలిన ఎరువులను సైతం సకాలంలో ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చేరవేసే విధంగా కార్యాచరణ రూపొందించారు. ఈ సంవత్సరం సీజన్ మొత్తానికి గాను (ఆరు నెలలకు సరిపడా) దాదాపు 2,87,327 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో ప్రధానంగా యూరియా 83,663 మెట్రిక్ టన్నులు, డీఏపీ 35,646 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 26,724 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1,38,014 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ ఎరువులు 2,580 మెట్రిక్ టన్నులు, సిటీ కంపోస్టు 1,200 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేశారు.