ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 10: ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో శనివారం జరిగిన స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎడతెరిపి లేని వానలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గురుకుల విద్యార్థులకు సీజనల్, వైరల్ జ్వరాలు వస్తున్నందున ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. గురుకులాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలన్నారు. అత్యధిక గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు.
గురుకులాల్లో ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం సగటున రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తోందన్నారు. అక్టోబర్లో రాష్ట్రంలో మరో 33 గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భోజనం, వసతి విషయాల్లో గురుకులాల అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు కూడా తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. స్వచ్ఛ స్ఫూర్తి నిత్యం కొనసాగాలని పిలుపునిచ్చారు. ఇకపై గురుకుల విద్యార్థుల ఆరోగ్యం, ప్రవర్తన, చదువు తదితర విషయాలపై ప్రభుత్వం ప్రోగ్రెస్ సిద్ధం చేయనుందని, ఇంటి నుంచి గురుకులానికి వచ్చే ప్రతి విద్యార్థికీ హెల్త్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసి వారి ఆరోగ్య పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతుందని అన్నారు.
పరిశుభ్రతతో వాధ్యుల నియంత్రణ..
పరిశుభ్రత పాటించడంతో వ్యాధులను నియంత్రించవచ్చని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అనంతరం వంటశాల, డైనింగ్, స్టోర్ రూములను మంత్రి పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మేయర్ నీరజ, కమిషనర్ ఆదర్శ్సురభి, గురుకులాల జాయింట్ సెక్రటరీ శారద, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ రాధికా గుప్తా, ఆర్సీవో ప్రత్యూష, ప్రిన్సిపాల్ చావా జ్యోతి, కార్పొరేటర్ శ్రీవిద్య పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ తెగువ.. స్ఫూర్తిదాయకం..: మంత్రి అజయ్
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ అని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఖమ్మం ధర్నాచౌక్ వద్ద గల ఐలమ్మ విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన మలిదశ ఉద్యమానికి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తినిచ్చిందని అన్నారు. మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, కమర్తపు మురళి, జక్కుల వెంకటరమణ, జక్కుల లక్ష్మయ్య, కణతాల నర్సింహారావు, షకీనా తదితరులు పాల్గొన్నారు.