ఖమ్మం, అక్టోబర్ 31: ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధికి, అహంకారానికి మధ్యే పోటీ జరుగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఇందులో ఎటువైపు నిలవాలో ఖమ్మం ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. ఇక్కడి ప్రజలు అభివృద్ధిని, ఆత్మగౌరవాన్నే కోరుకుంటున్నారని అన్నారు. ఖమ్మంలో మంగళవారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. పలు డివిజన్లలో నగర ప్రముఖులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలకు హాజరయ్యారు. 45వ డివిజన్ మామిళ్లగూడెంలో శాబాసు శ్రీను, అమృతసాయి అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. ఇన్నేళ్లూ ఎక్కడా కన్పించని తుమ్మల నాగేశ్వరరావు.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం ప్రజల ముందుకు వచ్చారని విమర్శించారు. పైగా దర్జాలు ప్రదర్శిస్తూ తనపై బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మంత్రిగా ఉండి గడిచిన ఐదేళ్లలో ఖమ్మంలో తాను చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉందని అన్నారు.
సంక్షేమ పథకాల ఫలాలను కూడా ఇంటింటికీ తిరిగి అందించానని గుర్తుచేశారు. మరి తుమ్మల నాగేశ్వరరావు ఇన్నాళ్లూ కనీసం కంటికి కూడా కనిపించకుండా ఎక్కడున్నారని ప్రశ్నించారు. ధంసలాపురం ఆర్వోబీ బ్రిడ్జి, నూతన బస్టాండ్, ఐటీ హబ్, గోళ్లపాడు ఛానల్, పారులు, రోడ్ల వంటి అనేక అభివృద్ధి పనులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను పూర్తి చేసిన విషయం ఖమ్మం ప్రజలందరికీ తెలుసునని అన్నారు. కానీ ఇన్నాళ్లూ ఏ మూలనో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఖమ్మమొచ్చి అవన్నీ ఆయన చేసినట్లుగా చెప్పుకుంటుండడంతో సిగ్గుచేటని అన్నారు. కనీస జ్ఞానం లేకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి తంతు చూస్తుంటే.. పక్క వాడికి జన్మించిన బిడ్డను కూడా తనకు జన్మించినట్లుగా చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితిలా కన్పిస్తోందని విమర్శించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, బుడిగెం శ్రీనివాస్, పగడాల నాగరాజు, జకుల లక్ష్మయ్య, శీలంశెట్టి వీరభద్రం, వల్లూరి విజయ్, మహేశ్, జయంత్, నాగరాజు, పసుపులేటి కవిత, బుడిగెం బద్రమ్మ, ఆకుల చంద్రకళ, నర్రా నాగమణి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.