మామిళ్లగూడెం, డిసెంబర్ 27: సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించడంలో పోలీసు శాఖలోని అన్ని విభాగాలూ నిబద్ధతతో సమష్టిగా పని చేస్తున్నాయని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. పోలీసు శాఖ ఉన్నతాధికారులు, సీపీలు, ఎస్పీలతో హైదరాబాద్లోని తన కార్యలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్లో మంగళవారం నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. నేర పరిశోధన, కేసుల దర్యాప్తు, నిందితుల అరెస్ట్, చార్జిషీట్ సమయాల్లో కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం ద్వారానే కేసుల్లో పురోగతి సాధించామన్నారు. జిల్లాలో ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ కేసు విచారణలో తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేస్తున్నట్లు ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ ఈ సందర్భంగా వివరించారు. ఏసీపీలు సుభాశచంద్రబోస్, కుమారస్వామి, ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఏసీపీలు వెంకటేశ్, రహెమాన్, వెంకటస్వామి, రవి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.