కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూలై 14 : కేసుల విచారణలో జాప్యం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, పోలీస్ శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లో పోలీస్ అధికారులతో ఎస్పీ మంగళవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, శాస్త్రీయ ఆధారాలతో పటిష్టమైన దర్యాప్తు నిర్వహించి నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సీసీటీఎన్ఎస్ 2.0, ఈ సాక్ష్య, నాట్గ్రిడ్ వంటి సాంకేతిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో గంజాయి, మత్తు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు గంజాయి హాట్ స్పాట్స్ను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చోరీ కేసులను ప్రాధాన్యతగా తీసుకుని సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో త్వరితగతిన ఛేదించి దొంగలించిన సొత్తును బాధితులకు అప్పగించాలని సూచించారు.
సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడంతోపాటు మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, డయల్-100కు వచ్చే ప్రతీ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు సత్వర సహాయం అందించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీలు లింగనబోయిన ఆదినారాయణ, ఆర్.సతీశ్కుమార్, వెంకన్నబాబు, అరుణ్కుమార్, అన్ని విభాగాల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పీఆర్వో బొల్లి సాయికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.