భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. నాలుగురోజులుగా జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. రాష్ట్రపతి హైదరాబాద్లో ఉదయం 7:45 గంటలకు హకీంపేట ఎయిర్పోర్టు నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకు వెళ్తారు. అక్కడ నుంచి 9:50 గంటలకు భద్రాచలం హెలీప్యాడ్కు చేరుకుంటారు. ఆ తర్వాత 10:15 నుంచి 10:30 వరకు భద్రాచలం రాములోరిని దర్శించుకొని ప్రసాద్ పథకాన్ని ప్రారంభిస్తారు. ఆమెతోపాటు ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్,ఎస్పీ వినీత్ ఏర్పాట్లను పరిశీలించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. దీంతో అధికార యంత్రాంగం గత నాలుగురోజులుగా అక్కడే మకాం వేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు పోలీసు, అటు జిల్లా యంత్రాంగం భద్రగిరిని చక్రబంధనంలో ఉంచారు. ప్రతి ఒక్క కదలికపై నిఘా పెట్టిన పోలీసులు పూర్తిస్థాయి ఆంక్షలు విధించారు. భద్రాచలం వంతెనపైకి ఎవరిని రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. సారపాక నుంచే వాహనాలను నిలిపివేశారు. ఇతరులు ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అడుగడుగునా పోలీస్ పహారా ఉందంటే సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పనక్కర్లేదు. బూర్గంపాడు మండలం సారపాకలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంతంలో మూడు హెలీపాడ్లను ఏర్పాటు చేసి ట్రైల్ రన్ వేశారు. సారపాక నుంచి రాష్ట్రపతి టూర్ ప్రారంభం కానుండడంతో భద్రాచలం గోదావరి వంతెన మీదుగా రామాలయం, వీరభద్రకళ్యాణ మండపం వరకు కాన్వాయ్ ద్వారా ట్రైల్ రన్ వేశారు. కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ పూర్తిస్థాయిలో వారి కంట్రోల్కు తెచ్చుకున్నారు.
యంత్రాంగం అంతా అక్కడే..
వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు, అధికారులు అక్కడే మకాం వేశారు. 2వేలకు మించి పోలీసులు, 300కి పైగా అధికారులు భద్రాచలంలో మకాం వేసి రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మీడియాకు అనుమతి లేనందున డీడీ, ఐఅండ్పీఆర్ ద్వారా కవరేజ్ ఇవ్వనున్నారు. కవరేజ్కు సంబంధించిన సూచనలు కూడా వారికి ముందుగానే వివరించారు. అధికారులు, ఉద్యోగులకు ముందస్తుగా పాస్లు ఇచ్చారు. ప్రతిఒక్కరూ కొవిడ్ పరీక్షలు చేయించుకుని విధులకు వెళ్లాల్సి ఉన్నందున అందరూ కొవిడ్ టెస్టులు చేయించుకున్నారు.
నేడు భద్రాచలానికి మంత్రి పువ్వాడ
ఖమ్మం, డిసెంబర్ 27 : రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భాగంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆమెతోపాటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 7గంటలకు ఖమ్మంలోని వీడీఓస్ కాలనీలో గల క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 9గంటలకు భద్రాచలం చేరుకుంటారు. రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మధ్యాహ్నం 1:45 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి 3:30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.
రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఇలా..
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి పర్యటన వివరాలిలా ఉన్నాయి.. 28వ తేదీన ఉదయం 7:20 గంటలకు హైదరాబాద్ బొల్లారం రోడ్డులోని రాష్ట్రపతి భవన్ నుంచి బయల్దేరుతారు. 7:40 గంటలకు హకీంపేటలోని ఎయిర్ఫోర్స్ స్టేడియానికి చేరుకుంటారు. 7:50 గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్లో ద్వారా 8:50 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 9గంటలకు బయల్దేరి 9:50గంటలకు భద్రాచలంలో ప్రత్యేక హెలీప్యాడ్కు చేరుకుంటారు. 10 గంటలకు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా 10:10 గంటలకు భద్రాచలం చేరుకుంటారు.
10:15 గంటల నుంచి 10:30 గంటల వరకు ఆలయాన్ని సందర్శించి, ప్రసాద్ స్కీం కింద శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. 10:30 గంటలకు స్వామివారిని దర్శించుకుంటారు. 10:40 గంటలకు శ్రీవీరభద్ర ఫంక్షన్ హాల్కు చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు ప్రత్యేక సమావేశం ఉంటుంది. 10:45 గంటల నుంచి 11:30 గంటల వరకు సమ్మక్క-సారలమ్మ పూజారి సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం వర్చువల్ విధానంలో కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లోని ఏకలవ్య పాఠశాలలను ప్రారంభిస్తారు. 11:30 గంటలకు శ్రీవీరభద్ర ఫంక్షన్ హాల్ నుంచి బయల్దేరి 11:40 గంటలకు ఐటీసీ అతిథి గృహానికి చేరుకుంటారు. 11:40 నుంచి మధ్యాహ్నం 1:15 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. 1:15 గంటలకు ఐటీసీ గెస్ట్హౌస్ నుంచి బయల్దేరి 1:25 గంటలకు భద్రాచలం హెలీప్యాడ్కు చేరుకుంటారు. 1:35 గంటలకు హెలీకాప్టర్ ద్వారా బయల్దేరి వెళ్లిపోతారు.