భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 12 (నమస్తే తెలంగాణ)/మామిళ్లగూడెం : ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. స్వీప్ నిర్వహణ, పెండింగ్ ఓటర్ల దరఖాస్తుల వంటి అంశాలపై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఆల పాల్గొన్నారు. వీసీలో ఎన్నికల అధికారి వికాస్రాజ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాలో ఎన్నికల ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు.
ఓటరు జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ ఏర్పాట్లు, ఈవీఎం యంత్రాలు, నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్ సిబ్బంది శిక్షణ తదితర అన్ని అంశాలతో కూడిన ప్రణాళిక రూపొందించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఓటరు అవగాహన కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో ప్రచారం కల్పించాలని తెలిపారు.వీసీలో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, మధుసూదన్నాయక్, వేణుగోపాల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, శిక్షణ సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.