మామిళ్లగూడెం, ఫిబ్రవరి 9 : ఖమ్మంలో ఇటీవల కూలిన గ్రంథాలయ భవనం వంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వ శిథిల భవనాలను తనిఖీ చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాలపై చేపట్టిన చర్యలపై శుక్రవారం నూతన కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవనాల తనిఖీ సమయంలో రిజిస్టర్ నిర్వహించి అందులో రిమారులు పొందుపర్చాలన్నారు. వర్షపు నీరు భవనాల స్లాబ్, వెంటిలేటర్ల వద్ద నిల్వకుండా ఉండేలా చూడాలని, టాయిలెట్ల లీకేజీలతో కూడా భవనం దెబ్బతింటుందని, ఈ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఇంజినీరింగ్ శాఖలు తమ తమ పరిధిలోఎన్ని భవనాలు శిథిలావస్థకు చేరాయి.. ఎన్ని కూల్చి వేశారు.. ఎన్నింటికి మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకురావొచ్చో లేదో నివేదిక సమర్పించాలని ఆదేశించారు కూల్చివేతకు నోటీసులు జారీ చేసి ఆర్థిక భారం పడకుండా చర్యలు చేపట్టాలన్నారు.
నూతన భవన నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ శ్యాంప్రసాద్, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి, పీఆర్, గిరిజన, విద్యా శాఖ ఈఈలు పాండురంగ విఠల్, నాగశేషు, తానాజీ, జిల్లా వ్యవసాయాధికారిణి విజయనిర్మల, జిల్లా గిరిజన సంక్షేమాధికారిణి విజయలక్ష్మి, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి వేణు మనోహర్, డీఈవో సోమశేఖరశర్మ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జయప్రకాశ్, జిల్లా బీసీ సంక్షేమాధికారిణి జ్యోతి, కలెక్టరేట్ ఏవో అరుణ, షెడ్యూల్ సంక్షేమ శాఖ ఆర్సీవో ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.