భద్రాచలం, ఫిబ్రవరి 8 : భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల/కళాశాల బాలికలు సూపర్ స్టూడెంట్స్ టీ-శాట్ లైవ్ ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్లో బుల్లితెరపై పాఠాలు బోధించి మన్ననలు అందుకున్నారు. 9వ తరగతి చదువుతున్న ఆర్.మౌనిక తెలుగులో శతక పద్యం, ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న బి.జమున ఎకనామిక్స్లో మనీ బ్యాంకింగ్ విధానంపై పాఠాన్ని బోధించి ఔరా అనిపించారు.
బాలికలు బోధించిన తీరును మెచ్చుకుంటూ రాష్ట్ర గిరిజన గురుకుల, సోషల్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ(ఐఏఎస్) అధికారి కె.సీతాలక్ష్మి, డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి ప్రశంసాపత్రంతోపాటు నగదు బహుమతిని అందజేశారు. కాగా.. విద్యార్థులను గురువారం గిరిజన గురుకుల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మెండెం దేవదాస్ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల, కళాశాల టీచర్లు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.