గుండాల/ ఆళ్లపల్లి, సెప్టెంబర్ 1: పేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, పట్టుదలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉందని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధ్దానాలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ మాటతప్పదని, నూతన పింఛన్ల మంజూరుతో ఇది మరోసారి రుజువైందని స్పష్టం చేశారు.
మండలంలో నూతనంగా ఆసరా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు స్థానిక రైతువేదికలో గురువారం ఆయా పింఛన్ కార్డులు, మంజూరు పత్రాలను ప్రభుత్వ విప్ పంపిణీ చేసి మాట్లాడారు. మండలంలో 407కి నూతనంగా ఆసరా పింఛన్లు మంజూరయ్యాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం 57 ఏళ్లు నిండిన వృద్ధులకు పింఛన్ మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా గుండాల మండలానికి చెందిన యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి సాదారంగా ఆహ్వానించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎష్ నాయకులు ముక్తి సత్యం, సత్యనారాయణ, నాగదివ్య, దీపిక, హజ్రత్ వలీ తదితరులు పాల్గొన్నారు.
పేదల జీవితాల్లో వెలుగులు..
టీఆర్ఎస్ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పింఛన్లతో పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ఆళ్లపల్లి మండలంలో నూతనంగా మంజూరైన 372 పింఛన్ గుర్తింపు కార్డులను మండల కేంద్రంలో బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కొమరం హన్మంతరావు, కోండ్రు మంజుభార్గవి, మంగమ్మ, పాయం నర్సింహారావు, ఎస్కే బాబా, వెంకటేశ్, సతీశ్, హఫీజ్, రవి, సతీశ్, ప్రవీణ్ పాల్గొన్నారు.