ఖమ్మం, జూలై 25 : సీఎం కేసీఆర్ సహాయ సహకారాలతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థికంగా ఎదిగారని, ఎంపీగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని, ఇప్పుడు ప్లేటు ఫిరాయించి కేసీఆర్నే ఆయన విమర్శిస్తున్నారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మండిపడ్డారు. ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పొంగులేటి పతనం ఖాయమన్నారు. చేరదీసిన వ్యక్తులనే వెన్నుపోటు పొడిచే వ్యక్తిత్వం ఉన్న పొంగులేటిని ఏ పార్టీ సహించదన్నారు. ఆయనకు జనబలం లేదనడానికి ఇటీవల అశ్వరావుపేట, సత్తుపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సభలే నిదర్శనమన్నారు. సమైక్య రాష్ట్రమే కావాలని పొంగులేటి నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో జతకట్టిన సంగతిని ప్రజలెవరూ మరచిపోలేదన్నారు. డబ్బుందనే అహంభావంతోనే పొంగులేటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, యువనేత కేటీఆర్ సహకారంతో అన్నివిధాల అభివృద్ధి చెందిన పొంగులేటి డబ్బు గర్వంతో విర్రవీగుతున్నారని, ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. గత ఏడాది డిసెంబర్ 31 వరకు సీఎం కేసీఆర్ దేవుడు, పేదల పక్షపాతి, తెలంగాణ ప్రజల ఆరాధ్యుడు అని పొగిడిన వ్యక్తే ఈ రోజున విమర్శలు చేస్తున్నారని అన్నారు. పొంగులేటి అక్రమ ఆస్తులు మొత్తం కక్కిస్తామని పేర్కొన్నారు. దళిత ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. 2014కి ముందు వైఎస్ విజయమ్మ జిల్లాకు వస్తే అడ్డగించిన ఉద్యమకారులను పొంగులేటి చంపుతానని బెదిరించిన విషయం మర్చిపోలేదన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, తెలంగాణ ఉద్యమ నాయకులు ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, ఖమ్మం రూరల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, నాయకులు పగడాల నరేందర్, మధు తదితరులు పాల్గొన్నారు.