మామిళ్లగూడెం, జనవరి 9 : గ్రామాల సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు 2023-24 సంవత్సరానికి ప్రణాళికలు రూపొందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 2000 నుంచి 2015 సంవత్సరం వరకు ప్రపంచ వ్యాప్తంగా 8 అంశాలపై లక్ష్యం చేరుకోవాలనే ఉద్దేశంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏర్పరచినట్లు, ఇందుకు 115 దేశాలు తీర్మానం చేసుకొని, 2016 నుంచి అమలుకు నిర్ణయించి 2030కి లక్ష్యం చేరుకునేలా కార్యాచరణ చేపట్టినట్లు ఆమె తెలిపారు. 2023-24 సంవత్సరానికి ప్రణాళిక చేసేప్పుడు ప్రతి శాఖలో చేపడుతున్న పథకాల అమలు, ఎంత ఖర్చు చేసిందీ పొందుపర్చాలన్నారు.
పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించాలన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన తదితరాల అంశాలపై ప్రగతికి చర్యలు ఉండాలన్నారు. నేటి నుంచి శిక్షణా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వీటిలో అధికారులు పాల్గొనాలని తెలిపారు. గ్రామసభల షెడ్యూల్ ప్రకారం అధికారులు సభలకు హాజరుకావాలన్నారు. జిల్లా ఉద్యానవన శాఖ 2023 నూతన సంవత్సరం క్యాలెండర్ను అధికారులు ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, ఆర్డీవో రవీంద్రనాథ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బహుమతులు అందజేత
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ గురుకుల విద్యాలయ సంస్థ నిర్దేశించిన స్వచ్ఛ గురుకుల్ డ్రైవ్లో విజేతలకు అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి బహుమతులు అందించారు. జడ్పీ సమావేశ మందిరంలో బహుమతులకు సంబంధించిన చెకులను అందజేశారు. సెప్టెంబర్- 2022 మొదటి వారంలో స్వచ్ఛ గురుకుల్ డ్రైవ్ వారోత్సవాలు చేపట్టామని, ఇందులో చురుగ్గా పాల్గొని, స్వచ్ఛ గురుకులాలుగా మార్చిన వారికి నగదు బహుమతులు ఆందజేసినట్లు తెలిపారు. ప్రథమ బహుమతి రూ.20 వేలను టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాల, అడవిమల్లెల, రెండో బహుమతిగా రూ.15 వేలు డాక్టర్ బీఆర్ అంబేదర్ కళాశాల, ఎన్ఎస్పీ క్యాంపు, మూడో బహుమతిగా రూ.10 వేలు టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాల, దానవాయిగూడెం గెల్చుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్సీవో కె.ప్రత్యూష, అడవిమల్లెల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రాజ్యలక్ష్మి, అంబేదర్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి, దానవాయిగూడెం కళాశాల ప్రిన్సిపాల్ నిరుపమ పాల్గొన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాలి
గ్రీవెన్స్ డే దరఖాస్తులను అధికారులు త్వరితగతిన పరిషరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి సూచించారు. గ్రీవెన్స్ డేలో భాగంగా జడ్పీ సమావేశ మందిరంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సింగరేణి రేమిడియేషన్ నిధుల నుంచి మంజూరైన చెక్డ్యాంలకు అటవీ అధికారుల నుంచి అనుమతులు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.