అశ్వారావుపేట, నవంబర్ 26: ఆయిల్ఫెడ్ నిర్దేశించిన క్యాలండర్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్పాం సాగును విస్తరిస్తున్నట్లు సంస్థ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలోని ఆయిల్ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్ఫెడ్ ఏరియాలో 75 వేల ఎకరాల్లో సాగు విస్తరించాల్సి ఉండగా ఇప్పటివరకు 45 వేల ఎకరాలకు విస్తరించామన్నారు. జిల్లాలో ఆయిల్పాం మొక్కల కొరతను నివారించేందుకు జనగాం, తొర్రూర్ నర్సరీల నుంచి మొక్కలు తెప్పిస్తున్నామన్నారు.
ఇప్పటివరకు 62,700 మొక్కలు రైతులకు పంపిణీ చేశామన్నారు. వచ్చే ఏడాది ఎక్కువ సంఖ్యలో మొక్కలు అందిస్తామన్నారు. ఆయిల్ఫెడ్, అధికారులు, రైతులను సమన్వయం చేసుకుని అత్యధికంగా ఈ ఏడాది 19.32 శాతం ఓఈఆర్ సాధించామన్నారు. దీనివల్ల టన్ను గెలలకు రూ.100- రూ.150కి గెలల ధర పెరుగుతున్నదన్నారు. వచ్చే ఏడాది ఓఈఆర్ లక్ష్యాన్ని 19.50కు నిర్దేశించుకున్నట్లు స్పష్టం చేశారు.
2023 చివరి కల్లా దమ్మపేట మండలంలోని అప్పారావుపేట ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని 60 నుంచి 90 టన్నులకు పెంచుతామన్నారు. రెండో ఫ్యాక్టరీని 2024 నాటికి పూర్తి చేస్తామన్నారు. ముందుగా ఆయన ఖమ్మం జిల్లా కల్లూరుగూడేనికి ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలంతో పాటు కల్లూరుగూడెం, రేగళ్లపాడు ఆయిల్పాం నర్సరీలను సందర్శించారు. సిబ్బందికి సలహాలు, సూచనలిచ్చారు. పర్యటనలో ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ బాలకృష్ణ, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్ కల్యాణ్, సిబ్బంది పాల్గొన్నారు.
దమ్మపేట రూరల్, నవంబర్ 26: ఆయిల్పాం రైతుల సమస్యలు పరిష్కరించాలని సొసైటీ అధ్యక్షుడు జోగేశ్వరరావు శనివారం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డిని కోరారు. ట్రాక్టర్లలో గెలల దిగుమతి సీరియల్ను ఎలక్ట్రానిక్ బార్ కోడ్తో నిర్వహించాలన్నారు. రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. క్యాంటీన్ సౌకర్యం కల్పించాలన్నారు. సమస్యలపై ఆయిల్ఫెడ్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు.