ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సొంతింటి కల సాకారం
తోగ్గూడెంలో ‘డబుల్’ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక
9న ఇళ్ల కేటాయింపు: రేగా
మణుగూరు రూరల్, జూన్ 7: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వల్లనే పేదల చిరకాల స్వప్నమైన సొంతింటి కల నెరవేరుతోందని అన్నారు. తోగ్గూడెంలో నిర్మించిన 40 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లుతో కలిసి లక్కీ డిప్ ద్వారా 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వసతులతో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తోందని అన్నారు. లక్కీ డిప్లో ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల 9న ఇళ్లను కేటాయిస్తామన్నారు. తహసీల్దార్ నాగరాజు, ఎంపీపీ కారం విజయ, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యంబాబు, తొగ్గూడెం సర్పంచ్ బొగ్గం రజిత, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కరకగూడేనికి జూనియర్ కళాశాల: రేగా
కరకగూడెం, జూన్ 7: కరకగూడేన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రేగా పేర్కొన్నారు. మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన.. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన కరకగూడెం మండలానికి ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైనట్లు తెలిపారు. కాగా, ఎమ్మెల్యే సమక్షంలో కళాశాల అభివృద్ధికి కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా గ్రామానికి చెందిన చిట్టి వెంకటేశ్వర్లు, అక్కిరెడ్డి వెంకటరెడ్డి, బైరిశెట్టి సూర్యనారాయణ, ఎలిపెద్ది శ్రీనివాసరెడ్డి, పోగు వెంకటేశ్వర్లు ఉన్నారు.
దళితుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
దళితుల సంపూర్ణ అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. గ్రామానికి చెందిన చిట్టిమళ్ల ప్రవీణ్కుమార్కు దళితబంధు ద్వారా మంజూరైన ట్రాక్టర్ను మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు.