పరుగు పందెం మహిళలు 800 మీటర్లు 5.20 నిమిషాల్లో..
పురుషులు 1,600 మీటర్లు 7.20 నిమిషాల్లో పూర్తి చేయాలి.
లాంగ్జంప్
మహిళలు 4 మీటర్లు, పురుషులు 6 మీటర్లు జంప్ చేయాలి.
షాట్ఫుట్
మహిళలు 2.5 మీటర్లు, పురుషులు 4మీటర్ల దూరం విసరాలి.
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్నది. వివిధ ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఉద్యోగమే లక్ష్యంగా యువత పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. గ్రంథాలయాలు, కోచింగ్ సెంటర్లు, మైదానాలు ఎక్కడ చూసినా.. ఉద్యోగార్థులే కనిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖలో ఖాళీల భర్తీకి గత ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నది. దీంతో యువత మైదానాల్లో లాంగ్జంప్, రన్నింగ్, షాట్ఫుట్ తదితర అంశాల్లో తర్ఫీదు పొందుతున్నారు. వీరికి బీసీ స్టడీ సర్కిల్, పోలీసుశాఖ, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద, ప్రైవేట్ సంస్థలు అండగా నిలుస్తున్నాయి. ఉచిత శిక్షణతోపాటు భోజన వసతి కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. అంతేకాదు, స్టడీమెటీరియల్ కూడా అందిస్తున్నాయి. కాగా, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు ఈవెంట్స్ ప్రక్రియ గురువారం ప్రారంభం కానున్నది. ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే దేహదారుఢ్య పరీక్షలకు ఉమ్మడి జిల్లా నుంచి 24,733 మంది హాజరుకానున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
హాజరుకానున్న అభ్యర్థులు 24,733
అడిషనల్ డీసీపీలు : 2
ఏసీపీలు : 11
సీఐలు : 17
ఎస్సైలు : 31
మహిళా ఎస్సైలు : 8
ఏఎస్సై / హెడ్ కానిస్టేబుళ్లు : 55
కానిస్టేబుల్/ హోంగార్డు ఆఫీసర్లు : 230
మామిళ్లగూడెం, డిసెంబర్ 7 : పోలీస్శాఖలోని వివిధ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా ఫిజికల్ ఎఫియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు గురువారం ప్రారంభం కానున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. బుధవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ సందర్శించిన సీపీ విధివిధానాలపై పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే దేహదారుఢ్య పరీక్షలకు 355మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 24,733 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు.
అభ్యర్థుల ఎంపికలో ఆరోపణలకు తావులేకుండా మైదానంలో సీపీ కెమెరాలు ఏర్పాటు చేసి సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈవెంట్స్కు వచ్చే అభ్యర్థులందరూ ఉదయం 5గంటలకు ఖమ్మం పోలీస్ హెడ్క్వార్టర్స్ చేరుకుని క్యూలైన్లో టోకెన్ పొందాలన్నారు. ధ్రువపత్రాలను పరిశీలించి, బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరుతీసుకున్న తరువాత పరేడ్ గ్రౌండ్లోకి అనుమతించడం జరుగుతుందన్నారు. అభ్యర్థుల కోసం పరేడ్ గ్రౌండ్లో వైద్యబృందం, షామియానాలు, తాగునీరు, మొబైల్ టాయిలెట్స్ సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. అభ్యర్థుల ప్రతిభ, సామర్థ్యాల ఆధారంగానే పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందనే విషయాన్ని అభ్యర్థులు గ్రహించాలని సూచించారు. ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగాల పేరుతో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పరిసరాల్లో నిఘా వ్యవస్థ పటిష్ఠం చేశామని తెలిపారు.
అభ్యర్థుల కఠోర సాధన
కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 7: ‘చేయ్.. జగము మరిచి జీవితమే సాధన… నీ మదిని తరచి చూడడమే శోధన… ఆశయమన్నది నీ వరం… తలవంచును అంబరం… నీ కృషి నీకొక ఇంధనం… అది సాగర బంధనం..’ అన్నాడు ‘అశ్వని’ చిత్రంలో ఓ సినీ కవి. పోలీస్ ఉద్యోగాల సాధనలో భాగంగా ఈవెంట్స్ సాధించేందుకు కఠోర సాధన చేస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు ఈ పదాలు అక్షరాలా సరిపోతాయి. ఉద్యోగమే లక్ష్యంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వారు కొత్తగూడెం ప్రగతి మైదాన్లో సాధన చేస్తున్నారు. ఈసారి కచ్చితంగా ఉద్యోగం సాధిస్తామనే కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. ఈనెల గురువారం నుంచి ఖమ్మం నగరంలో ప్రారంభంకానున్న ఈవెంట్స్లో సత్తా చాటి మెయిన్స్కు క్వాలిఫై కావాలని ఆకాంక్షిస్తున్నారు. వారందరికీ ఆల్ ది బెస్ట్.
పోటాపోటీగా ప్రాక్టీస్..
యువతీ యువకులు పోటాపోటీగా ఈ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. కొత్తగూడెం పట్టణంలో రెండు స్టేడియాలు పోస్టాఫీస్ సెంటర్లోని ప్రకాశం స్టేడియం, రామాటాకీస్ ఏరియాలోని ప్రగతిమైదాన్ ప్రాక్టీస్కు అనువుగా ఉన్నాయి. ప్రగతిమైదాన్ కొన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉండడంతో కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, 20 కిలోమీటర్ల దూరం ఉన్న చండ్రుగొండ ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి క్వాలిఫైడ్ అభ్యర్థులు వస్తున్నారు. డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఇంజినీరింగ్, ఎంటెక్, చదివిన, ప్రస్తుతం చదువుతున్నవారు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడినవారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఇక్కడ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. ప్రత్యేకంగా కోచ్లను ఏర్పాటు చేసుకొని వారు ఫుల్జోష్లో ప్రాక్టీస్కు అంకితమయ్యారు. 200 మంది యువకులు, 100మంది యువతులు ప్రస్తుతం ఈ మైదానంలో సాధన చేస్తున్నారు. రన్నింగ్, లాంగ్జంప్, షాట్పుట్లో ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా ఇంకా మెరుగ్గా ఈవెంట్స్లో రాణించి స్కోర్ చేయాలని అప్పుడే మెరిట్ సాధించవచ్చనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ప్రయత్నలోపం లేకుండా సాధన చేస్తున్న వీరందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పాల్సిందే…
ఉద్యోగం సాధించడమే లక్ష్యం
పోలీస్ ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఫిజికల్ ఫిట్నెస్ సాధించాను. తప్పకుండా ఈవెంట్స్లో విజయం సాధిస్తానన్న ఆత్మవిశ్వాసం ఉంది. దీనిలో 1600 మీటర్ల పరుగు పందెం లక్ష్యం ప్రధానం. ఆ దిశగా సాధన చేశాను. గ్రౌండ్లో ఇతర అభ్యర్థులు, శిక్షకులను చూసి నేర్చుకున్నాను.
-ఆడెపు ప్రవీణ్, కరుణగిరి, ఖమ్మం
పోలీస్ ఉద్యోగంపై ఆసక్తి
పోలీస్ ఉద్యోగంపై ఆసక్తితో సాధన చేశాను. ప్రిలిమనరీలో అర్హత సాధించిన తరువాత ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది. ఎస్సై ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఈవెంట్స్ సాధన చేశాను. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తాననే నమ్మకం ఉంది. అన్ని ఫిజికల్ ఈవెంట్స్ కోసం కఠోరంగా శ్రమించాను.
– పుట్టి ఝాన్సీ, గుదిమళ్ల, ఖమ్మం రూరల్
కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నా..
ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఉదయం, సాయంత్రం కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నా. నాతోపాటు అనేక మంది పోటాపోటీగా ఈవెంట్స్ చేస్తున్నారు. పోలీస్ ఉద్యోగం సాధించాలంటే కష్టపడాల్సిందే. అందుకే ఒకవైపు కళాశాలకు వెళ్తునే మరోవైపు ఈవెంట్స్పై ప్రత్యేక దృష్టి సారించా. కచ్చితంగా ఈవెంట్స్ కూడా క్వాలిఫై అవుతాననే నమ్మకం ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు.
– రోహిత, ఉద్యోగార్థి, లక్ష్మీదేవిపల్లి
120 మందికి కోచింగ్ ఇస్తున్నా..
ప్రగతిమైదాన్లో సుమారు 300 మందికి పైగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. పోలీస్ డిపార్టుమెంట్ వారు కూడా ఇక్కడ కోచింగ్ ఇస్తున్నారు. నేను 120 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాను. 2014 నుంచి నేను ఆర్మీ, కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాను. అనేక మంది క్వాలిఫై అయ్యా రు. ప్రస్తుతం ఇస్తున్న వారిలో ప్రతి ఒక్కరూ ఈవెంట్స్లో క్వాలిఫై అవుతారు. అందరూ నిర్దేశించిన సమయానికే ఈవెంట్స్ను పూర్తి చేస్తున్నారు.
– నరేశ్, కోచ్, కొత్తగూడెం