మామిళ్లగూడెం, ఫిబ్రవరి 28 : నేరాల గుర్తింపు విషయంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) మరింత సమర్థవంతంగా పని చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. బుధవారం నగరంలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ను సందర్శించిన సీపీ.. నేరాలు, దొంగతనాలు, దోపిడీలు తదితరాలను గుర్తించడంలో దర్యాప్తు అధికారులకు అందిస్తున్న సహాయాన్ని, పాత నేరస్థుల కదలికలకు సంబంధించి ముందస్తు సమాచార సేకరణలో సీసీఎస్ పోలీసుల పనితీరును స్వయంగా పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నేరాల ఛేదనలో కీలకంగా వ్యవహరించే సీసీఎస్ను పటిష్ఠ పరిచేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. అంతేకాక ప్రాపర్టీ రికవరీపై సీసీఎస్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ రకాలైన నేరాల అదుపునకు అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.