ఖమ్మం, డిసెంబర్ 30 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే హడావిడిగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఆదిలోనే అభాసుపాలవుతున్నది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం మంచిదే.. కానీ రద్దీకి తగ్గట్లు బస్సులు లేకపోవడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. సరిపడా బస్సుల్లేక ప్రయాణికులు ఈసడించుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధి ఖమ్మం రీజియన్లో ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 550 బస్సులు మాత్రమే ఉన్నాయి. గతంలో 67 శాతం ఉన్న ఆక్యుపెన్సీ ప్రస్తుతం 85 శాతానికి పెరిగింది. అప్పుడు రోజుకు లక్ష నుంచి లక్షా ఐదు వేల మంది ప్రయాణం చేయగా.. ఇప్పుడు లక్షా నలభై వేల మంది వరకు ప్రయాణిస్తున్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
ఎన్నికల హామీని అమలుచేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలవుతున్నది. సరైన ప్రణాళిక, ముందుచూపు లేనికారణంగా పేదలు, ముఖ్యంగా మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే అత్యంత ఆర్భాటంగా ప్రారంభించిన ‘మహాలక్ష్మి’ పథకం అమలులో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తలలు పట్టుకుంటున్నారు. ప్రతిరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 6 డిపోలు పరిధిలో అనేక రూట్లలో ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నవి. వాటిని సరిచేయలేక కండక్టర్లు, డ్రైవర్లకు తలనొప్పిగా మారాయి. సరిపడా బస్సులు లేకపోవడం, పథకం అమలుపై ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, బస్సుల సంఖ్యను పెంచకపోవడం, అద్దె బస్సు యజమానుల సమస్యలను పరిష్కరించకపోవడం, పండుగలు, పెళ్లిళ్ల సీజన్ తదితర ప్రత్యేక అవసరాల్లో నడిపే బస్సులపై సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల మహాలక్ష్మి పథకం ఆదిలోనే అభాసుపాలవుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధి ఖమ్మం రీజియన్లో ఏడు డిపోలు ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 550 బస్సులు ఉన్నాయి. వీటిలో 8 శాతం బస్సులు అంటే.. 44 బస్సులను స్పేర్లో ఉంచి 506 బస్సులను మాత్రమే నడుపుతారు. ఖమ్మం రీజియన్ పరిధిలో పల్లె వెలుగు 200, ఎక్స్ప్రెస్ 173, ఏసీ 32, సూపర్ లగ్జరీ 80, డీలక్స్ 7 ఉన్నవి. వీటిలో ప్రభుత్వం పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లకు మాత్రమే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది.
పెరిగిన డిమాండ్
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో బస్సులకు డిమాండ్ పెరిగింది. రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరిగింది. కానీ వారికి తగ్గట్లు బస్సులు అందుబాటులో లేవు. రోజుకు దాదాపు 40వేల మంది ప్రయాణికులు పెరిగారు.. కానీ బస్సులు మాత్రం గతంలో ఉన్నవి మాత్రమే ఉన్నవి. ఉన్న రూట్లలో ఎక్కువ బస్సులు నడపాలని, ఇంతవరకు బస్సులు లేని గ్రామాలకు కొత్తగా బస్సులు నడపాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నది.
కొత్తవాటిపై ఆశలు
ఆర్టీసీ సంస్థలో 2,050 బస్సులు కొత్తవి రానున్నాయని ఆ సంస్థ ఎండీ ఇటీవల ప్రకటించారు. వాటిలో 1,000 ఎలక్ట్రిక్ బస్సులు, 1,050 డీజిల్ బస్సులు రానున్నాయి. ఇవే వస్తే కనుక ఖమ్మం రీజియన్కు సుమారు 100 బస్సులు అదనంగా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ప్రయాణికుల బాధలు తప్పే అవకాశం ఉంది.
భారీగా పెరిగిన ఆదాయం
ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏడు డిపోల్లో మహాలక్ష్మి పథకం అమలుకు ముందు రోజుకు కోటి రూపాయల ఆదాయం వస్తే, ప్రస్తుతం రూ.కోటీ నలభై లక్షల ఆదాయం వస్తున్నది.. అంటే దాదాపు రోజుకు రూ.40 లక్షల ఆదాయం పెరిగింది.
పండుగలకు ప్రత్యేక బస్సులు లేనట్లే..
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ పథకం ప్రారంభానికి ముందు ఖాళీ సీట్లతో తిరిగిన బస్సులు ఎక్కడ చూసినా కళకళలాడుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఆదాయం పరుగులు తీస్తున్నది. మహిళలకు టికెట్ ఉచితంగా ఇస్తున్నప్పటికీ ఆ డబ్బును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనున్నది. దీంతో ఆర్టీసీ సంస్థకు ఆదాయం బాగా పెరిగినట్లయ్యింది. గతంలో 50 శాతం కూడా నిండని బస్సుల్లో 75 నుంచి 80 శాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) పెరుగుతూ వస్తున్నది. గతంలో ఖమ్మం రీజియన్లో 67 శాతం ఆక్యుపెన్సీ ఉండగా.. ప్రస్తుతం 85 శాతానికి పెరిగింది. మహాలక్ష్మికి ముందు గతంలో ఖమ్మం రీజియన్ పరిధిలో రోజుకు ఒక లక్ష నుంచి ఒక లక్షా ఐదు వేల మంది ప్రయాణికులు ప్రయాణం సాగించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య రోజుకు ఒక లక్షా ముప్పైఐదు వేల నుంచి ఒక లక్షా నలభై వేల వరకు పెరిగారు.
ఏ బస్సు చూసినా కిక్కిరిసిన రద్దీతో ఉంటోంది. మామూలు రోజుల్లో ఐతే గతంలో పండుగకో, శుభకార్యాలు ఉన్నప్పుడో బస్సుల్లో సీట్లు నిండేవి. ఆ సందర్భాల్లో ఇతర మార్గాల్లో ఖాళీగా నడిచే బస్సులను రద్దీ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా నడుపుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేవారు. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం ద్వారా ఉన్న ఆర్టీసీ బస్సులు రద్దీగా మారడంతో పండుగ సీజన్లో ప్రత్యేక బస్సులు ఎలా అనే ప్రశ్న తలెత్తుతున్నది. నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగలకు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, మణుగూరు తదితర ప్రాంతాలకు రాకపోకలు పెరగనున్నాయి. ఉద్యోగాలరీత్యా వెళ్లిన వారు, చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు సంక్రాంతి పండుగకు వస్తుంటారు. అయితే ఈ ఏడాది స్పెషల్ బస్సులు లేనట్లేనని ప్రజలు నిరాశ చెందుతున్నారు.
బస్సుల సంఖ్యను పెంచాలి
ఉచిత ప్రయాణం చేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది.. మంచిదే కానీ బస్సులను కూడా పెంచాలి. బస్సు ఎక్కితే కాలుపెట్టే అవకాశం లేదు. కండక్టర్ వచ్చి టికెట్ కూడా ఇవ్వలేకపోతున్నారు. బస్సులు ఎక్కువ ఉంటే ఈ ఇబ్బందులు ఉండవు కదా. సీఎం సార్ ఈ విషయంపై దృష్టి సారించాలి.
– ఎన్.విజయలక్ష్మి, విభలాపురం, మోతె మండలం, సూర్యాపేట జిల్లా
ముందుగా ప్లాన్ చేస్తే బాగుండు
పథకం పెట్టే ముందే బస్సులను పెంచితే ఇబ్బంది ఉండేది కాదు. ఉచిత ప్రయాణం చాలా మంచిదే. కానీ ముందస్తు ప్లాన్ చేసి అన్ని గ్రామాలు, పట్టణాలకు బస్సులను పెంచితే ప్రజలకు ఇబ్బందులు ఉండేవి కావు. ఇప్పటికైనా బస్సుల సంఖ్యను పెంచి ప్రజల ఇబ్బందులు తొలగించాలి.
-కాశిమల్ల భవాని, ప్రయాణికురాలు, ఖమ్మం
కొద్దిరోజుల్లోనే కొత్త బస్సులు
ఆర్టీసీ ప్రయాణికులు కండక్టర్, డ్రైవర్కు సహకరించాలి. దురుసుగా ప్రవర్తించి వారి విధులకు భంగం కలిగించవద్దు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ ధ్రువపత్రాన్ని కండక్టర్కు చూపించాలి. నిలబడి ప్రయాణం చేయవద్దు. ఆధార్ ఫోన్లో ఉందని, జిరాక్స్ ఉందని అనవద్దు. తక్కువ దూరం ప్రయాణం చేసేవారు పల్లె వెలుగులో చేయాలి. రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల వల్ల బస్సులు సరిపోవడం లేదు. కొద్దిరోజుల్లో కొత్త బస్సులు వస్తాయి. ఆ తరువాత ఎలాంటి ఇబ్బందులుండవు.
– సీహెచ్ వెంకన్న, ఖమ్మం రీజియన్ మేనేజర్