రఘునాథపాలెం, జూన్ 18: ఖమ్మం మున్సిపల్ కార్పొరేటర్, బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణను ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీసులు మంగళవారం అక్రమంగా అరెస్ట్ చేశారు. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సీహెచ్ స్వామి ఫిర్యాదు మేరకు కృష్ణపై కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. తెల్లవారుజామున 6 గంటలకే ఆకస్మికంగా ఇంటికి వచ్చిన పోలీసులు.. విచారణ పేరుతో అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ స్టేషన్ ఎదుట నినాదాలు చేశారు. అనంతరం అక్రమంగా అరెస్ట్ చేసిన తమ పార్టీ నాయకుడిని తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఖమ్మం ఏసీపీ రమణమూర్తికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా మచ్చలేని నాయకుడిగా పేరున్న 41వ డివిజన్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ అరెస్ట్ అక్రమమని అన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి అక్రమంగా కేసులు పెడుతోందని విమర్శించారు. కర్నాటి కృష్ణపై పెట్టిన కేసు విచిత్రంగా ఉందన్నారు. ఎన్నెస్పీ కాలువ నిర్మాణంలో భాగంగా నాటి ప్రభుత్వం కర్నాటి కృష్ణ సొంత భూమిని తీసుకుందని గుర్తుచేశారు.
ప్రస్తుతం ఎన్నెస్పీ కాలువ గట్టుపై నివసిస్తున్న అనేక మంది పేదలు ఆ స్థలాల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. తమ పార్టీ నేత కృష్ణ కూడా 59 జీవో కింద రెగ్యులరైజేషన్ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడని వివరించారు. అయితే ఆ దరఖాస్తును పరిశీలించిన అధికారులు.. కృష్ణ పొజీషన్లో లేకపోవడం కారణంగా ఇప్పటికే తిరస్కరించినట్లు చెప్పారు. అయినప్పటికీ అసలు దరఖాస్తు చేసుకోవడమే తప్పంటూ అతడిని అక్రమంగా అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆరు గ్యారెంటీల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారని.. వారి దరఖాస్తులు తిరస్కరణకు గురైతే ఆ దరఖాస్తులన్నీ అక్రమమేనంటూ ప్రజలందరినీ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. అంతేగాక 59 జీవో కింద 3 వేలకు పైచిలుకు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని.. వారిని కూడా అరెస్టు చేస్తారా ప్రశ్నించారు. ప్రజాపాలనపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసే ఇలాంటి దుశ్చర్యలు సరైనవి కావని స్పష్టం చేశారు. కర్నాటి కృష్ణ అక్రమ అరెస్ట్ విషయం గురించి తెలుసుకున్న మాజీ మంత్రు లు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్ కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీ నాయకుడిని తక్షణం విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఆందోళన చేసిన వారిలో కార్పొరేటర్ బుడిగం శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు డోకుపర్తి సుబ్బారావు, బత్తుల మురళి, బిచ్చాల తిరుమలరావు, మేకల సుగుణారావు, దిలీప్, జక్కుల లక్ష్మయ్య, పగడాల నరేందర్, లింగనబోయిన సతీశ్, అరెంపుల వీరభద్రం, షేక్ షకీనా, షేక్ ఉస్మాన్, పొదిల నాగరాజు, వీరయ్య, అబ్బాస్, ఈదుల రాజేశ్ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ భూమి రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాడనే ఆరోపణలతో బీఆర్ఎస్ నాయకుడు, కేఎంసీ 41వ డివిజన్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖమ్మం మూడో అదనపు న్యాయస్థానం తప్పుపట్టింది. ముందస్తు నోటీసులు జారీ చేయకుండా అరెస్ట్ చేసిన విధానం చట్టబద్ధంగా లేదని పోలీసులను కోర్టు మందలించింది. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సీహెచ్ స్వామి ఫిర్యాదు మేరకు ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీసులు కర్నాటి కృష్ణపై కేసు నమోదు చేశారు. మంగళవారం తెల్లవారుజామున ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును తప్పుపడుతూ బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు బిచ్చాల తిరుమలరావు, మేకల సుగుణారావు, దిలీప్చౌదరి, తన్నీరు లలిత, చింతల వెంకటేశ్వర్లు ఖమ్మం కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. కర్నాటి కృష్ణ అరెస్ట్ సరైనది కాదని స్పష్టం చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చి కేసు వేయాలని పోలీసులను ఆదేశించింది. కాగా, కేవలం రాజకీయ కుట్రతో కర్నాటి కృష్ణను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయించేందుకు కుటిల పన్నాగం పన్ని విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.