కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 8: నిత్యజీవితంలో ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వాటి స్థానంలో పర్యావరణ హిత వస్తువులు వినియోగించాలని ప్రభుత్వం పదే పదే సూచిస్తున్నది. చిరు వ్యాపారులు, కిరాణ దుకాణ నిర్వాహకులు 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లను మాత్రమే వినియోగదారులకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు క్లాత్, జూట్ బ్యాగులు వినియోగించాలని ప్రోత్సహిస్తున్నది. ఈక్రతువులో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సమాఖ్యలనూ భాగస్వాములను చేస్తున్నది. దీనిలో భాగంగా పాల్వంచలో మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో స్టీలు (భర్తన్) బ్యాంక్ ఏర్పాటు చేసింది. స్టీల్ బ్యాంక్ నిర్వహణ బాధ్యతలను ‘అమ్మదీవెన’ మహిళా సమాఖ్యకు అప్పగించింది. సమాఖ్య ఫంక్షన్లు నిర్వహించే వారికి నామమాత్రపు కిరాయితో వంట, టెంట్ సామగ్రి అందిచనున్నది. సమాఖ్య రూ.1.65 లక్షలతో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఒకేసారి 500 మంది వండిపెట్టేంత 18 రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి.
భోజన ప్లేటు ఒక్కంటికి రోజుకు రూ.2, టిఫిన్ ప్లేట్లకు రూ.1.50, మంచినీటి గ్లాసు రూ.1, టీ గ్లాసు రూ.0.50 పైసలు, చెంచాలు రూ.0.25 పైసలు, స్వీట్ బౌల్స్ రూ.1, బేషిన్ రూ.15, బకెట్ రూ.20, లాడిల్స్ (కర్రీ సర్వీంగ్ స్పూన్) రూ.5, రైస్ గరిటె రూ.5, వాటర్ జగ్ రూ.10, కట్లరి ట్రే రూ.10, చిన్న స్టీల్ ట్రే రూ. 5, వేస్ట్ టబ్ రూ.100, జాలి టబ్స్ రూ.100, వంట గిన్నెలు (40 కిలోలు, 20 కిలోలు, 10 కిలోలు) రూ.200 కిరాయి చెల్లించాల్సి ఉంటుంది.
స్టీలు బ్యాంకును ‘అమ్మదీవెన’ మహిళా సమాఖ్య నిర్వహించనున్నది. టెంట్ హౌస్ నిర్వాహకుల కంటే ఇంకా తక్కువ కిరాయితోనే సంఘం వీటిని అద్దెకు ఇవ్వనున్నది. అలా వచ్చిన అద్దెలతో పట్టణ సమాఖ్య సభ్యులు ఆర్థికంగా ఎదగనున్నారు. ఫంక్షన్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడడంలో సమాఖ్య సభ్యులు భాగస్వాములు అవుతూనే తామూ ఆర్థికంగా ఎదగనున్నారు.
ప్రస్తుతం నిర్వహించే ప్రతి శుభకార్యంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరిగిపోయింది. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్టీలు వస్తువులను వినియోగించాలనే ఉద్దేశంతో పట్టణంలో స్టీలు బ్యాంకు ఏర్పాటు చేయించాం. తద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు మహిళా సమాఖ్య సభ్యులకూ ఉపాధి దొరుకుతుంది.