ఖమ్మం రూరల్, నవంబర్ 14: కాంగ్రెస్ అంటే ప్రజలకు గోస అని, బీఆర్ఎస్ అంటే భరోసా అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పొరపాటున కాంగ్రెస్ను నమ్మితే ప్రజలకు మరోసారి గోస తప్పదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం, గొల్లగూడెం గ్రామాల్లో మంగళవారం పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డితో కలిసి రోడ్షోల్లో మాట్లాడారు. కందాళ కుటుంబానికి, ఈ ప్రాంత ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉందని అన్నారు. అదీగాక ఈ ఐదేళ్లలో స్థానిక ఎమ్మెల్యేగా కందాళ ఉపేందర్రెడ్డి పాలేరును అద్భుతంగా అభివృద్ధి చేశారని అన్నారు. తాను కూడా ఈ ప్రాంతం నుంచి రైల్వేలైన్ వెళ్లకుండా ఉండేందుకు పార్లమెంట్లో కొట్లాడానని వివరించారు. ఈ రాష్టం కేవలం సీఎం కేసీఆర్ చేతిలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ప్రజలు కూడా ఇదే నమ్ముతున్నారని అన్నారు. అందుకని మరోసారి కూడా బీఆర్ఎస్ గెలిపించాలని కోరారు.
పాలేరు నియోజకవర్గంలో బయటి వ్యక్తులకు స్థానం లేదని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. గతంలో ఎంపీగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అప్పట్లో ఒక్క రోజు కూడా ఈ గ్రామాల్లో పర్యటించలేదని, ఇక్కడి ప్రజల బాగోగులు పట్టించుకోలేదని విమర్శించారు. తాను మాత్రం ఇక్కడి ప్రజల కష్ట సుఖాల్లో తోడుగా నిలిచానని, తన శక్తి మేరకు సహాయ సహకారాలూ అందించానని గుర్తుచేశారు. ఈ సారి కూడా తనను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బానోత్ చంద్రావతి, తాళ్లూరి జీవన్కుమార్, బెల్లం వేణుగోపాల్, బెల్లం ఉమ, యండపల్లి వరప్రసాద్, గూడ సంజీవరెడ్డి, యాతాకుల భాస్కర్, వెంపటి ఉపేందర్, మైబెల్లి సాహెబ్, నారపాటి రమేశ్, గరుడ రమేశ్, దట్ల ప్రసాద్, తరుణ్ పాల్గొన్నారు.