ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ తల్లాడ, ఏప్రిల్ 21 : రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం, మొక్కజొన్నలను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తల్లాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు మంగళవారం పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సండ్ర వెంకటవీరయ్య నేతృత్వం వహించారు. తమ ఉసురు తగలకమానదంటూ ధర్నాలో పాల్గొన్న రైతులు ఆక్రోశించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమొస్తే రైతులకు యూరియా కష్టాలు తప్పడంలేదని ఎద్దేవా చేశారు.
ధాన్యం, మొక్కజొన్నలు చేతికొచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇంకా కొనుగోలు చేయడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయని, రైతుల నుంచి ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే ప్రభుత్వం ఇంత వరకూ ఒక్క కేజీ కూడా కొనుగోలు చేయలేదని, దీంతో రైతులు తక్కువ ధరకు ప్రైవేటులో అమ్ముకుంటూ నష్టపోవాల్సి వస్తోందని మండిపడ్డారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ గత కేసీఆర్ ప్రభుత్వం రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. కానీ, రేవంత్ ప్రభుత్వం మాత్రం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.
సీతారామపై దురుద్దేశ వ్యాఖ్యలు..
సీతారామ ప్రాజెక్టుపై మంత్రి తుమ్మల వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవని సండ్ర విమర్శించారు. అనుమతులు లేవని చెబుతున్న మంత్రి తుమ్మల.. సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన సభలో కేసీఆర్ను ఎలా పొగిడారని ప్రశ్నించారు. కేసీఆర్ వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని ఆనాడు ప్రశంసల జల్లు కురిపించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్పై ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోందని మండిపడ్డారు. ప్రజల్లో ఆయనకున్న ఆదరణ ఒకరు వేలితో తుడిచివేస్తే పోయేదికాదని గుర్తుచేశారు. అలాగే.. రైతుల గోడును పట్టించుకోకపోయినా; ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేయకపోయినా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం, తల్లాడ సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సండ్ర, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు తమ గోడును సండ్ర వెంకటవీరయ్య వద్ద వెళ్లబోసుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చి రోజుల తరబడి నిరీక్షిస్తున్నా ధాన్యం ప్రభుత్వం ఇంత వరకూ కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

హరీశ్రావుపై ఎదురుదాడి సిగ్గుచేటు
రుణమాఫీ వంద శాతం జరగలేదంటూ, మంత్రి ప్రాతినిథ్య మండలమైన రఘునాథపాలెంలో జరిగినట్లు నిరూపించినా తాను రాజీనామాకు సిద్ధమంటూ మాజీ మంత్రి హరీశ్రావు చేసిన సవాల్కు బెదిరిన కాంగ్రెస్ పాలకులు.. హరీశ్రావుపై ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటని సండ్ర విమర్శించారు. అయితే, ఈ సవాల్కు మంత్రి తుమ్మల నేరుగా స్పందించకుండా అసందర్భ వ్యాఖ్యలు, అనుచిత విమర్శలు చేయడం తుమ్మల స్థాయికి తగదన్నారు. ఎవరి పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందో రైతులకు, ప్రజలకు తెలుసునని అన్నారు. కేసీఆర్ను అధికారంలోకి రాకుండా చేయగలిగే శక్తి, సత్తా ఎవరికీ లేదని సీఎం రేవంత్రెడ్డి విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజల నిర్ణయాధికారం తన చేతుల్లో ఉందంటూ రేవంత్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. యూరియా కష్టాలు రైతులను మళ్లీ లైన్లలో నిలబెడుతున్నాయని అన్నారు.
నా భార్య పుస్తెలు తాకట్టు పెట్టా..
రైతుభరోసా సకాలంలో అందకపోవడంతో వ్యవసాయ పెట్టుబడికి తన భార్య పుస్తెలు సైతం తాకట్టు పెట్టా. ధాన్యం విక్రయిస్తే తప్ప అప్పులు తీర్చలేను. ప్రభుత్వమేమో ధాన్యం కొనడం లేదు. పది రోజుల క్రితం వరి పంట కోశాను. ఎంతో శ్రమకోర్చి తల్లాడలోని కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యాన్ని తీసుకొచ్చాను. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం నా ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. ఇప్పటివరకు ఇక్కడ నాలాంటి రైతులను పట్టించుకున్న నాథుడు లేడు.
-ఈలప్రోలు మంగయ్య, రైతు, తల్లాడ
ఇక్కడే పడిగాపులు కాస్తున్నా..
నేను 20 రోజుల క్రితం వరి పంట కోశాను. ఆ వెంటనే ధాన్యాన్ని ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే పడిగాపులు కాస్తున్నాను. ఏ పనికీ వెళ్లకుండా ధాన్యాన్ని చూసుకుంటూ ఇకడే ఉండాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం తమ పంటలను కొనుగోలు చేయలేదు. రైతులను కనీసం పట్టించుకోవడం లేదు. కానీ, గతంలో ప్రభుత్వ రైతుల నుంచి పంటను వెంటనే కొనుగోలు చేసేది.
-కొండలరావు, రైతు, నారాయణపురం, తల్లాడ